
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తనకు మంత్రి రాకుండా అడ్డుకుంటున్నది ఎవరో తనకు తెలుసన్నారు. నన్ను పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలియదా మేము ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామని .. పార్లమెంట్ ఎన్నికల సమయంలో రెండవసారి ప్రామిస్ చేసినప్పుడు తెలియదా మేమిద్దరం అన్నదమ్ములం ఉన్నామని రాజగోపాల్ రెడ్డి నిలదీశారు. ఒడ్డు దాటే వరకు ఓడ మల్లయ్య ఒడ్డు దాటాక బోడి మల్లయ్య అన్న చందంగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందన్నారు. 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉన్నప్పుడు.. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండడం తప్పా అని ప్రశ్నించారు. ఇద్దరం అన్నదమ్ముల్లో ఇద్దరం సమర్థులమే, ఇద్దరం గట్టి వాళ్లమే ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటిని అన్నారు.
మునుగోడు మండలం ఎలగలగూడెం లో 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్సీ నెలికంటి సత్యంతో కలిసి ప్రారంభించారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే రాజ్ గోపాల్ రెడ్డికి అన్యాయం జరిగినట్టె అన్నారు. తనకు అన్యాయం జరిగితే పర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని గత ప్రభుత్వానికి చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా అన్నారు రాజగోపాల్ రెడ్డి.
మంత్రి పదవిపై మీరు మాటిచ్చారు ఇచ్చినప్పుడు ఇవ్వండి కానీ అప్పటివరకు మాత్రం మునుగోడు అభివృద్ధికి సహకరించి ఒక్క రూపాయి కూడా ఆపొద్దని రాజగోపాల్ రెడ్డి కోరారు. ఇస్తామన్నమాట ఆలస్యమైంది సమీకరణాలు కుదరటం లేదు అంటున్నారు..ఎందుకు కుదరటం లేదు సమీకరణలు..తనకు మంత్రి పదవి రాకుండా ఎవరు అడ్డుకుంటున్నారని కోమటిరెడ్డి నిలదీశారు. ఈ ప్రాంతానికి అన్యాయం చేయొద్దు మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కోరారు.
భువనగిరి పార్లమెంటు నుండి ఎంపీగా పని చేశాను.. నల్గొండ జిల్లాకు ఎమ్మెల్సీగా పని చేశాను నల్గొండ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలలో మునుగోడు నియోజకవర్గం వెనుకబడి ఉందని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.ప్రభుత్వ దవాఖానకు పోతే పేదోడికి న్యాయం జరగాలి, ప్రైవేటు ఆసుపత్రులు ప్రైవేటు పాఠశాలలు పేదవాడి రక్తం తాగుతున్నాయి పేదవాళ్ల కండగా ఉండాలని నేను కష్టపడుతున్న
ఆ భగవంతుడు ఏ పదవి ఇచ్చినా మునుగోడు ప్రజల కోసమే కానీ నా కోసం కాదని భావోద్వేగానికి గురయ్యారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి
రాజగోపాల్ రెడ్డి.