
Kavitha: మోసం చేయడం హరీశ్రావు స్వభావమేనని, ఆయన రాజకీయ ప్రవర్తనలో ఇది కొత్తేమీ కాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర విమర్శలు చేశారు. మెదక్లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్లో జరుగుతున్న అంతర్గత విభేదాలను స్పష్టంగా బయటపెట్టారు. పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ బాణాలు సంధించడమే పనిలా మారిందని, నాయకత్వం దారితీసే బలం లేకపోవడం వల్ల ఈ పరిస్థితే ఏర్పడిందని ఆమె వ్యాఖ్యానించారు. ముఖ్యంగా కేటీఆర్పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన కవిత, ఆయన సోషల్ మీడియా ద్వారానే రాజకీయాలు చేస్తున్నారని, ఇప్పుడు సామాజిక మాధ్యమాలను పక్కన పెట్టి ప్రజల్లోకి రావాలని హితవు పలికారు.
బీఆర్ఎస్ పరాజయం తర్వాత హరీశ్రావు తాము కారణం కాదనే విధంగా బాధ్యత తప్పించుకోవడం ఆయన అసలు నైజమని కవిత పేర్కొన్నారు. ఆయనపై గట్టిగా మాట్లాడినప్పుడే తనను పార్టీ నుంచి తొలగించారని ఆమె గుర్తుచేశారు. కేటీఆర్, హరీశ్రావు ఇద్దరూ బయట ప్రపంచానికి కృష్ణార్జునుల్లా కనిపించాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, గ్రౌండ్స్థాయిలో పనిచేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆమె వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమయంలో 15 మంది స్వతంత్ర అభ్యర్థులు తన దగ్గరకు వచ్చి మద్దతు గురించి అడిగారని, తాను ఆ ఎన్నికతో సంబంధం లేదని వారికి స్పష్టం చేశానని కవిత చెప్పారు. అదే వ్యక్తులు హరీశ్రావు వద్దకు వెళ్లినపుడు కూడా ఆయన బాధ్యత తీసుకోకుండా మీ ఇష్టమున్న వారికి మద్దతు ఇవ్వండి అంటూ నిర్లక్ష్యంగా చెప్పారని ఆమె వెల్లడించారు. తాను బీఆర్ఎస్లో లేకపోవడం వల్ల ఉపఎన్నికల్లో దూరంగా ఉన్నానని, కానీ పార్టీలో ఉన్న హరీశ్రావు మాత్రం మోసం చేయడంలో పాలుపంచుకున్నారని ఆమె ఆరోపించారు.
తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని కవిత విమర్శించారు. ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నదని ఆమె అన్నారు. హరీశ్రావుతో పాటు ఆయన బినామీలు, వారి కంపెనీలకు ముఖ్యమంత్రితో సంబంధాలు ఉన్నాయని ఆమె తీవ్రమైన ఆరోపణలు చేశారు. సోషల్ మీడియా రాజకీయాలపై ఆధారపడినందుకే జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ఘోర ఓటమి పాలైందని ఆమె పేర్కొన్నారు. జగదీశ్ రెడ్డి, మదన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి వంటి నేతలకు ఇప్పుడు వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నలు లేవనెత్తారు. పార్టీ నాయకులు తమ ఆస్తులు పెంపొందించుకోవడం తప్ప కేడర్ను విస్తరించడానికి పనిచేయలేదని ఆమె అన్నారు.
అలాగే, పద్మా దేవేందర్ రెడ్డి రాజకీయ ప్రయాణాన్ని గుర్తుచేసిన కవిత.. 2009లో ఆమె ఎక్కడ ఉన్నారని, ఆ సమయంలో కేసీఆర్పై ఆమె రెండు చేతులా విమర్శలు చేసి పార్టీని విడిచిపెట్టారని, ఆ తర్వాత ఉద్యమం వేడెక్కినప్పుడు తిరిగి వచ్చి చేరారని పేర్కొన్నారు. కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేసిన పద్మా దేవేందర్ రెడ్డిని హరీశ్రావు ఎలా సమర్థిస్తారని ఆమె ప్రశ్నించారు. పార్టీ లోపలి రాజకీయాలు ఎలా పనిచేస్తున్నాయో స్పష్టంగా చూపిస్తూ కవిత చేసిన ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ అంతర్గత పరిస్థితులపై పెద్ద చర్చకు దారితీశాయి.
ALSO READ: బీబీసీకి ట్రంప్ మరో షాక్





