హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: ములుగు జిల్లాలో విస్తరించి ఉన్న ప్రకృతి సౌండర్యానికి నిలయాలైన కర్రెగుట్టలు మావోయిస్టుల ప్రభావం లేని ప్రశాంతంగా విస్తరించిందని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి వెల్లడించారు. జిల్లాలో పర్యటించిన ఆయన పామునూరు వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి గిరిజన ప్రాంతాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ కర్రెగుట్టలపై మావోయిస్టుల ప్రభావం పూర్తిగా శూన్యమైందని, ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఎల్లవేళలా గుత్తికోయ ప్రజలకు అండగా ఉంటూ వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. ప్రజల ఉపాధి అవకాశాలను పెంచే దిశగా పామునూరుకు చెందిన ఏడు కుటుంబాల ఉమ్మడి జీవనోపాధి కోసం ఒక ఆటో, ఒక ద్విచక్ర వాహనాన్ని అందజేయడంతో పాటు వారికి అవసరమైన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
అటవీ సంపద, ప్రకృతి అందాలతో అలరారుతున్న కర్రెగుట్టలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని ఆయన తెలిపారు. పర్యాటకులకు పూర్తి భద్రత కల్పించే లక్ష్యంతో పోలీస్ ఔట్పోస్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. పాలనలో పారదర్శకత మరియు వేగవంతమైన అభివృద్ధి కోసం అటవీ, రెవెన్యూ, సీఆర్పీఎఫ్ మరియు పోలీస్ శాఖల మధ్య సమన్వయాన్ని పెంచేందుకు ప్రత్యేక సమన్వయ కేంద్రాన్ని కూడా ప్రారంభించారు.
రోడ్డు భద్రతపై అవగాహన…
వెంకటాపురం పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా “అరైవ్ అలైవ్” అవగాహన కార్యక్రమానికి డీజీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుమారు 3,000 మంది పాల్గొన్న ఈ సభలో ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలను తప్పకుండా పాటించాలని, ప్రాణాల కంటే విలువైనది మరేదీ లేదని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 200 మంది వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేసి, పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించి వారి ఆరోగ్య భద్రతపై ఆరా తీశారు.అదే విధంగా డిజిపి బి. శివధర్ రెడ్డి పామునూరులోని సీఆర్పీఎఫ్ 39వ బెటాలియన్ ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ను సందర్శించి అక్కడ విధుల్లో ఉన్న జవాన్లతో ముఖాముఖి మాట్లాడారు.
మారుమూల ప్రాంతాల్లో వారు అందిస్తున్న సేవలు అభినందనీయమని ప్రశంసించారు. కర్రెగుట్టలు వంటి కొండ ప్రాంతాల్లో వ్యూహాత్మక పట్టు సాధించడానికి మరియు ప్రాంతాన్ని మావోయిస్టు రహితంగా కొనసాగించడానికి రాష్ట్ర పోలీస్ మరియు సీఆర్పీఎఫ్ బలగాల మధ్య నిరంతర సమన్వయం అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో పీసీసీఎఫ్ సువర్ణ, గ్రేహౌండ్స్ అదనపు డిజిపి అనిల్ కుమార్, ఎస్ఐబి ఐజిపి సుమతి, సీఆర్పీఎఫ్ ఐజీ విక్రమ్, ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్ తదితరులు పాల్గొన్నారు.
