
Israel-Iran War: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం భారత్ మీద మరింతగా పడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఇరాన్ హార్మోజ్ జలసంధి మూసివేయడంతో భారత్ కు ముడి ఆయిల్ సరఫరాకు ఇబ్బందులు తలెత్తనున్నాయి. మరోవైపు భారత్ నుంచి యూరప్ కు ప్రయాణించే విమానాలపైనా ఈ ప్రభావం పడబోతోంది. గల్ఫ్ కంట్రీస్ గగనతలంలో పరిస్థితులు ప్రమాదకరంగా మారడంతో భారత విమానాలు మరింత దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత విమానాలు పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించడం లేదు. ఇప్పుడు గల్ఫ్ ప్రాంతాల్లోనూ యుద్ధం వాతావరణం నెలకొనడంతో మరిన్ని ఇబ్బందులు కలగనున్నాయి. ఇకపై యూరప్ కు వెళ్లే విమానాలు ఒమన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్ మీదుగా లేదంటే హిందూకుష్ పర్వత శ్రేణులు, చైనా, తజకిస్తాన్ మీదుగా తిరిగి వెళ్లాల్సి ఉంటుంది.
మూడు గంటలు అదనపు ప్రయాణం
యూరప్ నుంచి భారత్ కు వచ్చే అన్ని విమానాలు కూడా చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రయాణ సమయంతో పోల్చితే సుమారు రెండు లేదంటే మూడు గంటల పాటు అదనంగా ప్రయాణించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల అదనపు ఖర్చు అవుతుంది. కొన్ని విమానాలు మధ్యలో ఆగి ఫ్యూయెల్ నింపు కోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఫలితంగా షెడ్యూల్ మారాల్సిన పరిస్థితి నెలకొంటుంది. విమానయాన సంస్థలకు పెను భారంగా మారనుంది.
పలు విమానాలు రద్దు
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేసినట్లు వెల్లడించాయి. ముఖ్యంగా ఢిల్లీ నుంచి జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్, స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ కు వెళ్లే విమానాలు, వాటి తిరుగు సర్వీసులను క్యాన్సిల్ చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఇదే బాటలో మరికొన్ని విమానయాన సంస్థలు పయనించే అవకాశం కనిపిస్తోంది.
Read Also: మోడీకి ఇరాన్ ప్రెసిడెంట్ ఫోన్.. ప్రధాని తీవ్ర ఆందోళన!