Rijiju Shares Video of Opposition MPs in Lok Sabha: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో ఈ నెల 4న ప్రధాని మోదీ మాట్లాడాల్సి ఉండగా.. ఆయన సభకు రాకముందే విపక్ష మహిళా ఎంపీలు ఆయన కుర్చీని చుట్టుముట్టడంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు తాజాగా రెండు వీడియోలను విడుదల చేశారు. తాము శాంతియుతంగా నిరసన తెలిపామని, మోడీపై చెయ్యెత్తే ఉద్దేశం తమకు లేదంటూ వారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
ఇదేనా మీ శాంతియుత నిరసన?
ఈ నేపథ్యంలో వారి శాంతియుత నిరసన ఇదేనంటూ రిజిజు ఆ వీడియోలను ‘ఎక్స్’లో పోస్టు చేశారు. బ్యానర్ పట్టుకుని ఆ మహిళా ఎంపీలు ప్రధాని కుర్చీ చుట్టూ చేరడం.. కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్, మరికొందరు ఎంపీలు వారిని వెనక్కి వెళ్లాలని కోరడం వాటిలో కనబడుతోంది. ‘తమ ఎంపీల దిగజారుడు ప్రవర్తనకు కాంగ్రెస్ ఎంతగానో గర్వపడుతోంది. మా ఎంపీలందరినీ గనుక మేం అడ్డుకుని ఉండకపోతే.. ప్రధాని కుర్చీని చుట్టుముట్టిన విపక్ష ఎంపీలను ఎదుర్కొనేందుకు మా మహిళా ఎంపీలను అనుమతించి ఉంటే.. సభలో చాలా దారుణ దృశ్యానికి దారితీసేది. పార్లమెంటు హుందాతనాన్ని కాపాడాలని.. దుందుడుకుగా వ్యవహరిస్తున్న విపక్ష ఎంపీలతో భౌతిక ఘర్షణకు బీజేపీ ఎంపీలు దిగరాదని మా నాయకత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి’ అని రిజిజు వెల్లడించారు.









