
Bihar Engineer Missing: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అమెరికా, ఇజ్రాయెల్ జంటగా ఇరాన్ మీద దాడులు చేయడంతో భయానకవాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇరాన్ లో భారత్ కు చెందిన ఓ యువ ఇంజినీర్ మిస్సయ్యాడు. అతడిని కాపాడాలంటూ కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
బీహార్ కు చెందిన ఇంజినీర్
బీహార్ లోని సివాన్ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల సిరాజ్ అలీ అన్సారీ, కొద్ది రోజుల క్రితం ఇరాన్ వెళ్లాడు. అక్కడ ఓ ప్రైవేట్ కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. ఇండియాకు చెందిన ఓ కంపెనీ అతడితో పాటు మరో 35 మందిని కొద్ది రోజుల క్రితం వర్క్ వీసాల మీద ఇరాన్ లోని అరాక్ ప్రాంతంలో ఓ ప్లాంట్ నిర్మాణం కోసం పంపింది. సిరాజ్ జూన్ 9న సౌదీ అరేబియా మీదుగా ఇరాన్ కు వెళ్లాడు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులు మొదలు పెట్టింది. అరాక్ ప్రాంతంలోనూ ఇజ్రాయెల్ క్షిపణులతో దాడులు చేసింది. ఈ నేపథ్యంలో సిరాజ్ తో పాటు మిగతా వారిని సదరు కంపెనీ ఓ రిఫైనరీ ప్లాంట్ టౌన్ షిప్ కు తరలించారు. ఆ తర్వాత తన కొడుకుతో సంబంధాలు లేవని కుటుంబ సభ్యులు తెలిపారు.
జూన్ 17న చివరి సారి కాల్
జూన్ 17న తన కొడుకుతో చివరిసారి ఫోన్ లో మాట్లాడినట్లు ఆయన తండ్రి హజ్రత్ అలీ తెలిపారు. ఆ తర్వాత నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందని చెప్పారు. తన కొడుకు ఉంటున్న ప్రాంతానికి కేవలం కిలో మీటర్ దూరం లో ఇజ్రాయెల్ మిసైల్ దాడి జిగినట్లు సిరాజ్ తమతో చివరిసారిగా చెప్పినట్లు తెలిపారు. తమ కొడుకును గుర్తించి క్షేమంగా భారత్ కు తీసుకురావాలని సిరాజ్ తండ్రి కేంద్ర విదేశాంగ అధికారులను కోరారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్ లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు భారత్ ‘ఆపరేషన్ సింధు’ చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 1,713 మంది భారతీయులను ఢిల్లీకి తీసుకొచ్చింది. ఇంకా ఈ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
Read Also: మోడీకి ఇరాన్ ప్రెసిడెంట్ ఫోన్.. ప్రధాని తీవ్ర ఆందోళన!