
Iran Attacks US Base: తమ అణు స్థావరాలపై దాడులకు పాల్పడిన అమెరికాకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించిన ఇరాన్, చెప్పినంత పని చేసింది. తాజాగా తీవ్ర స్థాయిలో ప్రతికార దాడులకు దిగింది. ఖరాత్, ఇరాక్ లోని అమెరికా బేస్ లపై క్షిపణి దాడులు చేసింది. ఖతార్ అల్ ఉదైద్ లో ఉన్న అతిపెద్ద అమెరికా బేస్ ను తమ క్షిపణులు తాకినట్లు ఇరాన్ సైన్యం వెల్లడించింది. ‘ద బ్లెస్సింగ్ ఆఫ్ విక్టరీ’ పేరుతో ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఇరాన్పై అమెరికా ఎన్ని బాంబులు వేసిందో.. అంతే సంఖ్యలో తాము అమెరికా బేస్ ల మీద క్షిపణులు ప్రయోగించినట్లు వెల్లడించింది. ఈ దాడులకు సంబంధించి తాము ముందుగానే ఖతార్ కు సమాచారం అందించినట్లు ఇరాన్ తెలిపింది.
ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను యాక్టివేట్ చేసిన అమెరికా
ఇరాన్ ప్రతిదాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో అమెరికా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను యాక్టివేట్ చేసింది. ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఇరాక్ లోని గగనత వ్యవస్ధలను అందుబాటులోకి తీసేకొచ్చింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో సైరన్లు మోగాయి. ఖతార్, కువైట్ తమ ఎయిర్ స్పేస్ ను క్లోజ్ చేశాయి.
ఇరాన్ దాడులను అడ్డుకున్నట్లు అమెరికా ప్రకటన
అటు ఇరాన్ దాడులను తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు అమెరికా ప్రకటించింది. ఇరాన్ నుంచి మిడిల్, లాంగ్ రేంజ్ క్షిపణులు వచ్చినట్లు వెల్లడించింది. అధ్యక్షుడు ట్రంప్ సిచ్యువేషన్ రూమ్ నుంచి పరిస్థితిని గమనించినట్లు వివరించింది. మరోవైపు ఖతార్, ఇరాక్తో పాటు బహ్రెయిన్, కువైట్ లోని అమెరికా బేస్ లపైనా దాడులు జరిగినట్లు ఇరాన్, ఇజ్రాయెల్ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఇరాన్ దాడులపై ఖతార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్కు తగిన గుణపాఠం చెబుతామని ప్రకటించింది. ఈ దాడులను సౌదీ అరేబియా కూడా ఖండించింది. మరోవైపు దోహాలోని ఉన్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని భారత ప్రభుత్వం సూచించింది. ఖతార్ లోని భారతీయ రాయబార కార్యాలయంతో టచ్ లో ఉండాలని కోరింది.