గత కొంత కాలంగా భారత్ పై అక్కసు వెళ్లగక్కుతూ, తమ మైనారిటీ హిందువులపై దాడులు, హత్యాకాండకు పాల్పడుతున్న బంగ్లాదేశ్కు కేంద్రం బడ్జెట్ గట్టి షాకిచ్చింది. ఏటా విదేశీ సాయం కింద కేటాయించే బడ్జెట్ కేటాయింపుల్లో బంగ్లాదేశ్ వాటాను సగానికి సగం తగ్గించింది. గత ఏడాది రూ.120 కోట్లుగా ఉన్న బడ్జెట్ కేటాయింపును 2026-27 బడ్జెట్లో రూ.60 కోట్లకు కుదించింది.
భారత్-బంగ్లా మధ్య దెబ్బతిన్న సంబంధాలు
భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు కొద్దికాలంగా దెబ్బతిన్నాయి. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలినప్పటి నుంచి అక్కడి తాత్కాలిక ప్రభుత్వం హయాంలో హిందువులతో సహా మైనారిటీలపై దాడులు, హత్యలు జరుగుతున్నాయి. దీనిపై భారత్ ఆందోళనలను బంగ్లా పాలకులు బేఖాతరు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏటా విదేశీ సాయం కింద ఆ దేశానికి ఇస్తున్న బడ్జెట్ కేటాయింపుల్లో ఈసారి కేంద్ర సగం కోత పెట్టింది.
భూటాన్కు అధిక సాయం
ఈసారి బడ్జెట్లో అత్యధికంగా భూటాన్కు రూ.2,288 కోట్ల ఆర్థిక సాయాన్ని కేంద్రం కేటాయించింది. ఇది గతం కంటే 6 శాతం ఎక్కువ. నేపాల్కు రూ.800 కోట్లు, శ్రీలంకకు రూ.400 కోట్లు, మయన్మార్కు రూ.300 కోట్లు కేటాయించింది. మాల్దీవులు, మారిషస్కు చెరో రూ.550 కోట్లు, అఫ్గానిస్థాన్కు రూ.150 కోట్లు, మంగోలియాకు రూ.25 కోట్లు, ఆఫ్రికన్ దేశాలకు రూ.225 కోట్లు, సీషెల్స్కు రూ.19 కోట్లు సాయం అందించనుంది.





