Mahatma Gandhi Statue Stolen in Australia: ఆస్ట్రేలియాలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా గాంధీ కాంస్య విగ్రహాన్ని కట్టర్లతో కట్ చేసి ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ప్రస్తుతం ఆస్ట్రేలియాలో సంచలనంగా మారింది. ఈ ఘటనపై భారత్ సీరియస్ అయ్యింది. వెంటనే నిందితులను పట్టుకుని, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ నగరంలో ఉన్న మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. నగరం శివారు ప్రాంతమైన రోవిల్లోని ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్లో ఈ విగ్రహం ఉంది. దీని బరువు 426 కిలోలు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్(ఐసీసీఆర్) ఈ విగ్రహాన్ని ఆస్ట్రేలియాకు బహుమతిగా ఇచ్చింది. 2021, నవంబరు 12న అప్పటి ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ గాంధీ విగ్రహాన్ని ఈ కమ్యూనిటీ సెంటర్లో ఆవిష్కరించారు. సోమవారం నాడు ముగ్గురు దుండగులు కట్టర్ల సాయంతో విగ్రహాన్ని కాళ్ల వరకు కోసి ఎత్తుకెళ్లారు.
ఘటనపై ఇండియా ఆగ్రహం
ఈ ఘటనై దీన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. నిందితులను వెంటనే పట్టుకొని కఠిన శిక్ష విధించాలని కోరింది. అటు అదే ప్రదేశంలో మరో కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించాలని సూచించింది. ప్రస్తుతం ఈ ఘటన ఆస్ట్రేలియాలో సంచలనంగా మారింది.





