Amit Shah: మార్చి 31 కల్లా నక్సల్స్‌ రహిత దేశంగా భారత్‌.. అమిత్‌ షా కీలక ప్రకటన!

మార్చి 31 లోగా భారత్‌ నక్సల్స్‌ రహిత దేశంగా మారబోతోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రకటించారు.

March 31 Deadline for Naxal-Free India: రానున్న మార్చి 31కల్లా భారత్‌ నక్సల్స్‌ రహిత దేశంగా మారబోతోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తేల్చి చెప్పారు. మరికొద్ది వారాల్లో గడువు ముగియనుండడంతో నక్సల్స్‌ వ్యతిరేక ఆపరేషన్లపై ఛత్తీస్ గఢ్‌ ప్రభుత్వం, అధికారులతో రాయ్‌పూర్‌లో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. భద్రతా బలగాలను ఏకం చేయడం, మౌలిక వసతుల విస్తరణ, మావోయిస్టుల ఆర్థిక నెట్‌వర్క్‌ ను దెబ్బతీయడం, లొంగుబాటు పాలసీల వంటివి నక్సలిజంపై పోరాటంలో సత్ఫలితాలను ఇచ్చినట్లు చెప్పారు.

విధ్వంసకర కమ్యూనిస్టు సిద్ధాంతం ఇక అవసరం లేదు!

విధ్వంసకర కమ్యూనిస్టు సిద్ధాంతం దేశానికి ఇక ఎంతమాత్రం అవసరం లేదని అమిత్‌ షా వెల్లడించారు. నక్సలైట్లు తమ ఆయుధాలను వీడాలని కోరారు. కమ్యూనిస్టుల పాలన ఉన్నచోట అభివృద్ధి ఉండదన్నారు. ప్రజాస్వామ్యంలో ఆ సిద్ధాంతానికి కాలం చెల్లిందని, త్రిపుర, పశ్చిమ బెంగాల్‌లలో వారి పాలన ముగిసిందన్నారు. కేరళలో ఉన్నా అక్కడా తిరువనంతపురం నుంచి మార్పు మొదలైందని పేర్కొన్నారు.

2024 నుంచి భద్రతా బలగాల పైచేయి..

ఛత్తీస్‌గఢ్‌లో 2024 నుంచి సెక్యూరిటీ బలగాలు పైచేయి సాధించాయి. 500 మందికి పైగా నక్సలైట్లు ఎన్‌కౌంటర్లలో హతమయ్యారు. వీరిలో సీపీఐ (మావోయిస్టు) సీనియర్ నేత, ప్రధాన కార్యదర్శి నంబాల కేశవ రావు (బసవరాజు) సహా పలువురు కీలక నేతలున్నారు. ఇదే సమయంలో సుమారు 1,900 మంది నక్సల్స్‌ను అరెస్టు చేయగా, 2,500 మంది లొంగిపోయారు.

 

అమిత్ షా నిర్వహించి కీలక సమావేశంలో ఛత్తీస్ గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయి, ఉప ముఖ్యమంత్రి విజయ్‌ శర్మ, కేంద్ర హోం కార్యదర్శి, ఇంటెలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్‌, హోం వ్యవహారాల శాఖ స్పెషల్‌ సెక్రటరీ, సీఆర్‌పీఎఫ్‌, బీఎ్‌సఎఫ్‌, ఐటీబీపీ, ఎన్‌ఐఏ డైరెక్టర్‌ జనరల్‌, ఛత్తీస్గఢ్‌, ఒడిశా, మహారాష్ట్ర, జార్ఖండ్‌, తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button