
Heavy Rains: వానాకాలం మొదలైనా అనుకున్న స్థాయిలో వర్షాలు కురవడం లేదు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ కీలక విషయాన్ని వెల్లడించింది. రాబోయే 5 రోజుల పాటు దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో వర్షాలు పడుతాయని తెలిపింది.
రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వానలు
గత రెండు రోజులుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. రుతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు తీవ్రంగా పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఇవాళ్టి నుంచి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇదే వాతావరణం తెలంగాణలోనూ ఉంటుందని వెల్లడించింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్టు ప్రకారం ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించింది.
ఆ రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
అటు ఇవాళ్టి నుంచి ఈ నెల 30 వరకు పంజాబ్, హర్యానా, చండీగఢ్ లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తాజాగా అక్కడ ఉష్ణోగ్రతలు భారీగా తగ్గినట్లు వెల్లడించింది. చండీగఢ్లో 34.1 డిగ్రీల సెల్సియస్, పంజాబ్లో 33.9 డిగ్రీల సెల్సియస్, లూధియానాలో 33.5, పటియాలాలో 33.1, పఠాన్ కోట్లో 34.1, మొహాలీలో 33.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు తెలిపింది. ఇక హర్యానాలో అంబాలాలో 33.4 డిగ్రీల సెల్సియస్, హిసార్లో 36.7, కర్నాల్లో 30.2, నర్నాల్లో 35.4, గురుగ్రామ్లో 36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు తెలిపింది. ఈ ప్రాంతాల్లో 5 రోజుల పాటు వానలు పడే అవకాశం ఉందని తెలిపింది.
Read Also: హైదరాబాద్ లో మూడు రోజులు వర్షాలు, ఐఎండీ కీలక అలర్ట్!