తెలంగాణ

రాష్ట్రంలో మరో 3 రోజులు అత్యంత భారీ వర్షాలు!

TG Rains: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో రాబోయే మూడురోజులు రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం  వాయుగుండంగా మారి దక్షిణ ఒడిశా, ఏపీ మధ్య తీరాలను దాటే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్‌, కామారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అటు నల్లగొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి, మహబూబ్‌ నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని చెప్పింది.

పలు జిల్లాల్లో భారీ వర్షాలు

ఇవాళ ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని.. నిర్మల్‌, నిజామాబాద్‌, భూపాలపల్లి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం చెప్పింది. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే సూచనలున్నాయని.. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతాయని వెల్లడించింది. గడిచిన 24గంటల్లో జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్‌, కామారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా సిద్దిపేట జిల్లా గౌరారంలో 23.6, మెదక్‌ జిల్లా అల్లాదుర్గ్‌లో 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button