బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరుగుతున్న దాడులు మరోసారి మానవత్వాన్ని ప్రశ్నించే స్థాయికి చేరుకున్నాయి. తాజాగా హిందూ వితంతు మహిళపై జరిగిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సెంట్రల్ బంగ్లాదేశ్లోని జెనైద్ జిల్లా, కాళిగంజ్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో 40 ఏళ్ల హిందూ వితంతు మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ అమానుష చర్య అక్కడి సమాజాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.
A 40-year-old Hindu widow was raped,
tied to a tree, her hair cut off, and brutally tortured in Kaliganj, Jhenaidah, BangladeshThe United Nations (UN) motto is to
maintain international peace & securityHindus are being slaughtered in Bangladesh, and the world is remaining… pic.twitter.com/yD82rdN042
— Adv. Homi Devang Kapoor (@Homidevang31) January 5, 2026
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత మహిళ కొంతకాలం క్రితం షహీన్ అనే వ్యక్తి నుంచి కొంత భూమితో పాటు రెండంతస్తుల ఇంటిని కొనుగోలు చేసింది. ఆస్తి కొనుగోలు అనంతరం నుంచే షహీన్ ఆమెపై ఒత్తిడి పెంచుతూ, బెదిరింపులకు దిగినట్లు సమాచారం. దీనిని ఆమె తీవ్రంగా వ్యతిరేకించడంతో, షహీన్ ఆగ్రహానికి గురయ్యాడని స్థానికులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో షహీన్, హసన్ అనే మరో వ్యక్తితో కలిసి మహిళ ఇంటికి వెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. మహిళపై అత్యాచారం చేసిన అనంతరం ఆమెను చెట్టుకు కట్టేసి జుట్టు కత్తిరించడం అత్యంత అమానుష చర్యగా మారింది. అంతేకాదు, ఈ మొత్తం ఘటనను వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా ఆమెను మానసికంగా మరింతగా హింసించినట్లు తెలుస్తోంది.
ఇంతటితో ఆగకుండా నిందితులు బాధితురాలిని డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వడానికి ఆమె నిరాకరించడంతో, ఆమె బంధువులపై కూడా దాడులకు పాల్పడ్డారు. బాధిత మహిళను తీవ్రంగా కొట్టడంతో ఆమె స్పృహ కోల్పోయింది. స్థానికులు స్పందించి ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మొదట ఆమె అత్యాచారం గురించి వైద్యులకు చెప్పలేకపోయినట్లు సమాచారం. అయితే వైద్య పరీక్షల సమయంలో ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు స్పష్టమైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా, అధికారికంగా కేసు నమోదు చేశారు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్లో హిందువులు, ఇతర మైనారిటీలపై వరుస దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత నెలలో దీపు చంద్రదాస్ను దారుణంగా హత్య చేయగా, ఖోకోన్ చంద్రదాస్పై జరిగిన దాడిలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. అలాగే మరికొందరు హిందువులు కూడా దాడులకు గురైన ఘటనలు వెలుగుచూశాయి. ఈ పరిణామాలు బంగ్లాదేశ్లో మైనారిటీలకు రక్షణ లేకుండా పోతోందా అనే సందేహాలను పెంచుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిందితులకు కఠిన శిక్షలు విధించాల్సిన అవసరం ఉందని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
