
హైదరాబాద్ కు ముప్పు ముంచుకొస్తోంది. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో గత మూడు రోజులుగా మహా నగరం ఆగమాగమవుతోంది. భారీ వర్షాలకు హిమాయత్సాగర్ నిండుకుండలా మారింది. నీటిమట్టం పెరగడంతో అప్రమత్తమైన అధికారులు నిన్న నాలుగు గేట్లు ఒక ఫీట్ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇవాళ ఐదో గేట్ కూడా ఎత్తి నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. వరద నీరు హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డుపై నుండి వెళ్తుండడంతో రాకపోకలు నిలిపివేశారు. రాజేంద్రనగర్ నుంచి అప్పా జంక్షన్ వెళ్లేవారు, అప్పా జంక్షన్ నుంచి రాజేంద్రనగర్ వచ్చేవారు బండ్లగూడ, కిస్మత్పూర్ బుద్వేల్ నుంచి వెళ్లాలని పోలీసులు సూచించారు. వరద నీరు ప్రవహిస్తున్న ప్రాంతంలో హిమాయత్ సాగర్ పరివాహక ప్రాంతాల వద్ద కూడా సెల్ఫీలు దిగడానికి ప్రజలు రావొద్దని పోలీసులు సూచిస్తున్నారు.