
తెలంగాణలో శాంతి భద్రతలు దారుణంగా తయారయ్యాయి. మర్డర్లు, మానభంగాలు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో పోలీసులకే రక్షణ కరువైంది. ఏకంగా పోలీస్ స్టేషన్లోనే హెడ్ కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసి పారిపోయిన దుండగుడి ఘటన పోలీస్ వర్గాల్లో కలకలం రేపింది. తెలంగాణ ప్రజలను కలవరపరుస్తోంది.
నిర్మల్ జిల్లా కుభీర్ పోలీసుస్టేషన్లో ఓ హెడ్ కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేశాడు దుండగుడు. గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కత్తితో పోలీస్ స్టేషన్లోకి వచ్చాడు దుండగుడు. నేరుగా ఎస్ఐ గదిలోకి వెళ్తుండగా అడ్డుకున్నాడు హెడ్ కానిస్టేబుల్ టి.నారాయణ, అయితే వెంటనే తన వద్ద ఉన్న కత్తితో ఆయన కడుపులో పైభాగంలో పొడిచాడు నిందితుడుఅక్కడే ఉన్న హోంగార్డు గిరిధారి అడ్డుకోవడానికి రాగా, బలంగా తోసేయడంతో అతని చేతులకు గాయాలయ్యాయి.
దుండగుడు దాడిలో గాయపడిన హెడ్ కానిస్టేబుల్, హోంగార్డు కేకలు వేశారు. వీరి అరుపులకు మిగతా సిబ్బంది, స్టేషన్ వెనుక క్వార్టర్లలోని పోలీసులు రావడంతో పరారయ్యాడు నిందితుడు.గాయపడిన నారాయణ, గిరిధారిలకు కుభీర్లో ప్రాథమిక చికిత్స అందించి.. మెరుగైన వైద్యం కోసం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వ్యక్తి మహారాష్ట్ర ప్రాంతం నుంచి వలస వచ్చినట్లు భావిస్తున్నారు పోలీసులు.