
ఏపీలో కొత్త ఎమ్మెల్సీల పరిస్థితి… వెయిటింగ్ మోడ్లో పడింది. పదవి చేపట్టి ఎప్పుడెప్పుడు బాధ్యతలు తీసుకుంటామా… ఎప్పుడెప్పుడు చట్టసభలో గళం వినిపిద్దామా అని ఉత్సాహంగా ఉన్న వాళ్లకు… స్మాల్ బ్రేక్ పడింది. ఈ సమావేశాల్లో వాళ్ల ఎంట్రీ కుదిరేట్టు లేదు. దీంతో… కొత్త ఎమ్మెల్సీలు ఒకింత నిరుత్సాహానికి గురవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటాలో ఐదుగురు ఎమ్మెల్సీలు ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైసీపీకి బలం లేక అభ్యర్థిని నిలబెట్టలేదు. దీంతో… కూటమి పార్టీలకు చెందిన ఐదుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం అయ్యారు. టీడీపీ నుంచి కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు… జనసేన నుంచి నాగబాబు… బీజేపీ నుంచి సోమువీర్రాజు ఎమ్మెల్సీలుగా ఎంపికయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో… మండలిలో అడుగుపెట్టి తమ వాదన కూడా వినిపించాలని కొత్త ఎమ్మెల్సీలు ఉత్సాహపడ్డారు. కానీ.. వారి ఆశ నెరవేరేటట్టు కనిపించడం లేదు. మండలిలో కొత్త ఎమ్మెల్సీల ఎంట్రీ ఆలస్యం అయ్యేట్టు కనిపిస్తోంది.
Read More : ప్రక్షాళన జరిగితేనే వైసీపీకి లైఫ్ – తుక్కు ఏరకపోతే పార్టీ నిలబడటం కష్టమే..!
ఏపీలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాలు ఈనెల 21వ తేదీతో ముగుస్తాయి. అయితే.. ఎవరి స్థానంలో ఈ ఐదుగురు కొత్త ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారో… వారి పదవీ కాలం ఈనెల 29 వరకు ఉంది. అంటే… ఈ బడ్జెట్ సమావేశాల్లో పాతవారే ఉంటారు. పాతవారి పదవీకాలాన్ని కుదించడం జరగని పని. కనుక కొత్త ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం కూడా 29 తర్వాతే ఉంటుంది. 29 తర్వాత కూడా అమావాస్య, రంజాన్, ఉగాది… ఇలా వరుస సెలవులు వచ్చాయి. దీంతో.. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన కొత్త ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారానికి వచ్చే నెల వరకు ఆగక తప్పని పరిస్థితి.
Read More : 2029లో టీడీపీ అధికారంలో ఉండటం కష్టమేనా – చరిత్ర ఏం చెప్తోంది..?
ఇక..మంగళవారం (మార్చి 18)న జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం తర్వాత.. సీఎం చంద్రబాబుతో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. వీరి చర్చల్లో కొత్త ఎమ్మెల్సీల అంశం కూడా వచ్చింది. నాగబాబు ప్రమాణస్వీకారం గురించి సీఎం చంద్రబాబుతో మాట్లాడారట పవన్ కళ్యాణ్. అంతేకాదు… నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చే విషయంపై కూడా చర్చించారట. నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖంగానే ఉన్నా… శాఖ విషయంలో క్లారిటీ రాలేదని సమాచారం.