సహజీవనం చేస్తున్న జంటలకు కీలక గుర్తింపు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా నిర్వహించబోయే జనగణనలో ఈ జంటలకు కుటుంబ హోదా కల్పించనున్నట్లు ప్రకటించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు వివాహితులకే కుటుంబ గుర్తింపు ఉండగా, ఇప్పుడు కలిసి జీవిస్తూ తమ బంధాన్ని స్థిరంగా కొనసాగిస్తున్న జంటలను కూడా కుటుంబంగా పరిగణించనున్నారు. ఈ నిర్ణయం సామాజిక మార్పులకు అనుగుణంగా తీసుకున్నదిగా భావిస్తున్నారు. సహజీవనం చేస్తున్న జంటలను అధికారికంగా గుర్తించడం ద్వారా వారి స్థితికి చట్టబద్ధత కల్పించాలనే ఉద్దేశంతో ఈ మార్పులు తీసుకొచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
జనగణన మొదటి దశకు సంబంధించి ప్రభుత్వం మొత్తం 33 ప్రశ్నలను విడుదల చేసింది. ఈ ప్రశ్నల రూపకల్పనలో భాగంగా సహజీవనం చేస్తున్న జంటల పరిస్థితిని స్పష్టంగా నిర్వచించారు. తమ సంబంధాన్ని స్థిరమైన బంధంగా భావించి కలిసి జీవిస్తున్న జంటలను వివాహితులుగా పరిగణించవచ్చని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ద్వారా దేశంలో పెరుగుతున్న సహజీవన విధానాన్ని గణాంకాల్లో సరిగ్గా ప్రతిబింబించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టుకుంది. ఈ మార్పులు భవిష్యత్తులో ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాల రూపకల్పనలో కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
జనగణనను ఈసారి రెండు దశల్లో నిర్వహించనున్నారు. మొదటి దశగా గృహ గణన చేపట్టనుండగా, ఇది 2026 ఏప్రిల్ 1న ప్రారంభం కానుంది. ఈ దశలో ఇంటి పరిస్థితులు, వసతులు, గృహ నిర్మాణం వంటి అంశాలను అధికారులు నమోదు చేస్తారు. ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ను ఉపయోగించనున్నారు. రెండో దశలో జనాభా గణన నిర్వహించనుండగా, ఇది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమవుతుంది. ఈ దశలో ప్రతి కుటుంబ సభ్యుడి వ్యక్తిగత వివరాలు సేకరించబడతాయి.
ఇంటి యజమాని వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు, కులం, కమ్యూనిటీ వంటి సమాచారం అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. అదనంగా కుటుంబంలో ఉపయోగిస్తున్న ఫోన్లు, ఇంటర్నెట్ సదుపాయం, వాహనాలు, గృహోపకరణాల గురించి కూడా వివరాలు నమోదు చేస్తారు. ఈ విధంగా సేకరించిన సమాచారం ఆధారంగా దేశ ఆర్థిక, సామాజిక పరిస్థితులపై సమగ్ర అంచనా వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ALSO READ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు.. ఇక సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు వాగితే జైలుకే..
