
Gaza’s Food Crisis: యుద్ధంతో ధ్వంసం అవుతున్న గాజాలో తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మన దగ్గర కేవలం రూ. 5కు దొరికే పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్ ను గాజాలో ఏకంగా రూ. 2,400కు అమ్ముతున్నారు. అక్కడ ఆహార కొరత ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇదో ఎగ్జాంఫుల్ గా నిలుస్తోంది. తాజాగా ఈ ధరలకు సంబంధించి ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉందంటే?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో సదరు వ్యక్తి తన కూతురుకి ఇష్టమైన పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్ కొనుగోలు చేసినట్లు చెప్పాడు. “చాలా రోజులుగా ఎదురు చూస్తున్నన నా కూతురుకు ఇష్టమైన పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్ కొనుగోలు చేశాను. గతంలో దీని ధర 1.5 యూరోలు(రూ.147) ఉండేది. ఇప్పుడు ఏకంగా 24 యూరోలకు(భారత కరెన్సీలో రూ.2,345) చేరింది. కానీ, ఆమె ఇష్టాన్ని కాదనలేక ఇప్పించాను” అని ఆ వీడియోలో సదరు గాజా వ్యక్తి వెల్లడించాడు.
కిలో చక్కెర ధర రూ. 4,914.. ఉల్లిగడ్డల ధర రూ. 4,400
2023 అక్టోబర్ నుంచి గాజాలో యుద్ధవాతావరణం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ గాజాకు ఆహార సరఫరాను క్రమంగా తగ్గించింది. ఈ ఏడాది మార్చి 2 నుంచి మే 19 వరకు పూర్తిగా నిలిపివేసింది. అంతర్జాతీయ ఒత్తిడితో కొంత మేరకు కొన్ని ట్రక్కులను అనుమతిస్తోంది. ఈ నేపథ్యంలో నిత్యవసరాల ధరలు మండుతున్నాయి. ఉత్తర గాజాలో కేజీ చక్కెర రూ. 4,914 పలుకుతోంది. కిలో వంట నూనె రూ. 4,177, కిలో బంగాళాదుంపలు రూ. 1,965, కిలో ఉల్లిపాయలు రూ.4,423 అమ్ముతున్నారు. ఇక కప్పు కాఫీ ధర ఏకంగా రూ.1,800కు విక్రయిస్తున్నారు. ధర పెరుగుదలతో గాజా వాసులు అరిగోస పడుతున్నారు.
Read Also: ఎవరి జోక్యం లేదు.. రాహుల్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ కౌంటర్!