ఏడుగురు వ్యక్తుల సజీవ దహనం
జయపుర, క్రైమ్ మిర్రర్: రాజస్థాన్లో భివాడీలోని ఓ రసాయన ఫ్యాక్టరీ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. సోమవారం తెల్లవారుజామున భివాడీలోని ఓ రసాయన ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. అనంతరం భారీ పేలుళ్లు సంభవించడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
ముందుజాగ్రత్త చర్యగాసమీపంలోని కర్మాగారాల్లో పని చేస్తున్నవారిని ఖాళీ చేయించామన్నారు. ఈ ప్రమాదంలో సజీవదహనమైన ఏడుగురి మృతదేహాలను బయటకు తీసినట్లు అధికారులు పేర్కొన్నారు. మరికొందరు కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఎంతమంది ఉన్నారనే విషయంపై స్పష్టత రావాల్సిఉంది. ప్రమాదంలో రూ.లక్షలు విలువ చేసే వస్తువులు, యంత్రాలు బూడిదయ్యాయన్నారు.
ఫ్యాక్టరీలో నిల్వ చేసిన గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అనుమానం వ్యక్తంచేశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అగ్ని ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ దిగ్భాంతిని వ్యక్తంచేశారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
