పలువురికి తీవ్ర గాయాలు
మహాబూబాబాద్, క్రైమ్ మిర్రర్: మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి చెందిన ఘటన ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది. మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండలం పురుషోత్తమాయిగూడెం శివారులో శుక్రవారం ఉదయం వేగంగా వచ్చిన కారు ఆటోను ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం కురవి వైపు వెళ్తున్న ఆటోలో పిట్టల శ్రీనివాస్, పద్మ, గాలి అరుణ, కీరి, శేఖర్, రామసాని వెంకన్నతో పాటు డ్రైవర్ రవీందర్ ప్రయాణిస్తున్నారు.
ఈ సమయంలో ఎదురుగా అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఆటోను ఢీకొట్టడంతో వారంతా కిందపడిపోయారు. వీరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా వెంటనే స్థానికులు స్పందించి గాయాలపాలైన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన రామసాని వెంకన్న(55) మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
మిగితా వారికి చికిత్స అందిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణం కావచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో వెంకన్న మృతి చెందాడనే విషయం తెలియగానే కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో ఈ ప్రాంతమంతా తీవ్ర విషాదం నెలకొంది. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
