క్రైమ్ మిర్రర్,చింతపల్లి:- నల్లగొండ జిల్లా, చింతపల్లి మండలం, గొడుకొండ్ల గ్రామంలో తాగునీటి ఎద్దడి పతాక స్థాయికి చేరింది. గత కొన్ని రోజులుగా గ్రామంలో నీటి సరఫరా, నిలిచిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మిషన్ భగీరథ నీళ్లు రాక, స్థానిక ట్యాంకులు నిండక గ్రామస్తులు చుక్క నీటి కోసం, ఇబ్బందులు పడుతున్నారు. అరకొర ఎండలకే ప్రజల పరిస్థితి ఇలా ఉంటే, ఎండలు ముదిరితే గొంతు ఎండిపోవడమే అంటున్నారు ప్రజలు.
గ్రామస్తులు నీటి గురించి అడిగితే, అధికారులు రిపేర్ ఉందనే సాకుతో, కాలం గడుపుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తరచూ ఏదో ఒక సాంకేతిక సమస్య ఉందంటూ, సరఫరాను నిలిపివేయడం పరిపాటిగా మారింది. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చే నాయకులు, ఇప్పుడు ప్రజలు దాహంతో అలమటిస్తున్నా, కనీసం అటువైపు చూడటం లేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. తాగడానికి వంట వండుకోవడానికి కూడా, నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా డబ్బులు పెట్టి నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోందని అంటున్నారు. ఇప్పటికైనా సాకులు చెప్పడం ఆపి, సమస్యను పరిష్కరించండని, గొడుకొండ్ల గ్రామ ప్రజల గొంతు ఎండకముందే తక్షణమే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. చింతపల్లి మండల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి, గొడుకొండ్ల గ్రామంలో నీటి సరఫరాను పునరుద్ధరించాలని, శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేనిపక్షంలో గ్రామస్తులందరం కలిసి ఆందోళన బాట పట్టక తప్పదని హెచ్చరిస్తున్నారు.
