
భార్య వంట చేయడం లేదని, ఇంటి పనులు సరిగా నిర్వహించడం లేదని విడాకులు మంజూరు చేయలేమని తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితుల్లో, కేవలం ఇంటి పనులు చేయలేదనే కారణాన్ని క్రూరత్వంగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది. మారుతున్న సామాజిక పరిస్థితులు, ఆధునిక జీవనశైలిని దృష్టిలో పెట్టుకునే ఈ తీర్పు ఇచ్చినట్లు ధర్మాసనం పేర్కొంది.
జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ నగేశ్ భీమపాకలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ ఎల్బీనగర్కు చెందిన ఓ వ్యక్తి తన భార్య ఇంటి పనులు చేయడం లేదని, వంట చేయకుండా తన తల్లికి సాయం చేయడం లేదని ఆరోపిస్తూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. ఈ కారణాల వల్ల తాను మానసికంగా హింసకు గురవుతున్నానని పిటిషన్లో పేర్కొన్నాడు.
అయితే కింది కోర్టు ఈ పిటిషన్ను తిరస్కరించింది. దీనిపై అసంతృప్తి చెందిన భర్త హైకోర్టును ఆశ్రయిస్తూ అప్పీల్ దాఖలు చేశాడు. ఈ అప్పీల్పై విచారణ చేపట్టిన హైకోర్టు.. దంపతులిద్దరి ఉద్యోగాలు, పనివేళలను పరిశీలించింది. భర్త మధ్యాహ్నం 1 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తుండగా, భార్య ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నట్లు కోర్టు గమనించింది.
ఇద్దరూ పూర్తి స్థాయి ఉద్యోగాలు చేస్తున్నప్పుడు, ఇంటి పనుల విషయంలో భార్యపై మాత్రమే బాధ్యతలు మోపడం సహేతుకం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. అంతేకాదు, గర్భస్రావం అనంతరం కోలుకునేందుకు భార్య పుట్టింటికి వెళ్లడాన్ని క్రూరత్వంగా భావించలేమని స్పష్టంగా పేర్కొంది. ఇది సహజమైన విషయం అని కోర్టు వ్యాఖ్యానించింది.
భర్త చేసిన ఆరోపణల్లో వైవాహిక బంధాన్ని రద్దు చేసేంత తీవ్రమైన కారణాలు లేవని తేల్చిన హైకోర్టు.. అతని అప్పీల్ను కొట్టివేసింది. ఆధునిక కాలంలో భార్యాభర్తలు పాతకాలపు ధోరణులతో కాకుండా పరస్పర అవగాహనతో బాధ్యతలను పంచుకోవాలని హైకోర్టు హితవు పలికింది. ఈ తీర్పు ఉద్యోగస్తులైన దంపతుల మధ్య సంబంధాలపై కీలక సందేశంగా నిలుస్తోంది.
ALSO READ: WOW: ఏడేళ్లుగా ఒంటికాలిపైనే నిల్చుని ఉన్నాడు.. (VIDEO)





