దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేరు వినగానే చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన ప్రత్యేకమైన వ్యక్తిత్వం, నాయకత్వం మాత్రమే కాదు, ఆయనకు ప్రత్యేకమైన దుస్తుల శైలి కూడా. ఆయన ధరించే ప్రతి దుస్తువు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఖాదీ కుర్తా నుంచి ఆధునిక సూట్ల వరకు ప్రతి దుస్తులో ఆయన వ్యక్తిత్వం ప్రతిబింబించేలా ఉండడం వల్లే మోదీ ఫ్యాషన్ ఒక ప్రత్యేక బ్రాండ్గా మారింది. ఈ స్టైల్ వెనుక ఉన్న కథ, దానిని తీర్చిదిద్దిన వ్యక్తులు, దాని ప్రయాణం గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలగడం సహజమే.
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల నుంచే మోదీ తన దుస్తుల విషయంలో ఒకే బ్రాండ్పై విశ్వాసం ఉంచుతున్నారు. అహ్మదాబాద్లో ప్రారంభమైన జైడ్ బ్లూ అనే మెన్స్ వేర్ సంస్థ ఆయన ఫ్యాషన్ ప్రయాణంలో కీలక పాత్ర పోషించింది. 1989 నుంచి బిపిన్ చౌహాన్, జితేంద్ర చౌహాన్ అనే ఇద్దరు సోదరులు మోదీ కోసం ప్రత్యేకంగా దుస్తులను రూపొందిస్తున్నారు. ప్రారంభంలో ఒక చిన్న దుకాణంగా ఉన్న ఈ వ్యాపారం, కాలక్రమేణా విస్తరించి కోట్ల రూపాయల వ్యాపారంగా ఎదిగింది. మోదీ ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా ఉన్న సమయంలో కూడా ఇదే దుకాణానికి వెళ్లి దుస్తులు తీసుకునేవారని సమాచారం. ఈ విశ్వాసమే తరువాత ఈ బ్రాండ్ను దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చింది.
మోదీ కుర్తా అనే ప్రత్యేక శైలి ఇప్పుడు ఒక ట్రేడ్మార్క్గా మారింది. సాధారణంగా కుర్తాలు పొడవైన చేతులతో ఉంటాయి. కానీ మోదీ సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని హాఫ్ హ్యాండ్స్ కుర్తాలను ఎంచుకోవడం ప్రారంభించారు. ఈ స్టైల్ ప్రజల్లో విపరీతమైన ఆదరణ పొందింది. 2012లో మోదీ కుర్తా, మోదీ జాకెట్ అనే పేర్లను అధికారికంగా ఉపయోగించుకోవడానికి మోదీ అనుమతి ఇచ్చారు. ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా షాపుకు వెళ్లలేని సందర్భాల్లో డిజైనర్లను ఢిల్లీకి పిలిపించి కొలతలు ఇవ్వడం జరుగుతుందని తెలుస్తోంది. వస్త్రం ఎంపిక నుంచి కుట్టు వరకు ప్రతి అంశాన్ని ఆయన స్వయంగా పరిశీలిస్తారని సమాచారం.
విదేశీ పర్యటనల సమయంలో మోదీ ధరించే సూట్లు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ వెస్ట్రన్ దుస్తుల వెనుక ముంబైకి చెందిన ప్రముఖ డిజైనర్ ట్రాయ్ కోస్టా కీలక పాత్ర పోషిస్తున్నారు. మోదీ శరీర నిర్మాణం, ఆయన వ్యక్తిత్వానికి తగ్గట్టుగా ఆధునిక శైలిలో సూట్లను రూపొందించడం ఆయన ప్రత్యేకతగా చెప్పవచ్చు. సంప్రదాయం, ఆధునికతను సమన్వయం చేస్తూ మోదీ ధరించే ప్రతి దుస్తువు ఒక సందేశాన్ని అందిస్తుంది.
మోదీ ఎక్కువగా ఖాదీ, కాటన్ వస్త్రాలను ఇష్టపడతారు. సందర్భాన్ని బట్టి కాషాయం, తెలుపు, నీలం, మట్టి రంగులను ఎంచుకోవడం ఆయనకు అలవాటు. ఈ ప్రత్యేక శైలి ప్రజల్లో విపరీతమైన ఆదరణ పొందడంతో, జైడ్ బ్లూ బ్రాండ్ విడుదల చేసే దుస్తులు మార్కెట్లో వేగంగా అమ్ముడవుతున్నాయి. మోదీ స్టైల్ ఇప్పుడు కేవలం వ్యక్తిగత అభిరుచి మాత్రమే కాకుండా, దేశీయ ఫ్యాషన్ రంగంలో ఒక ట్రెండ్గా మారింది.
ALSO READ: మీ మెదడు పవర్ నాలుగింతలు!.. ‘పోమోడోరో’ టెక్నిక్ గురించి తెలుసా?
