
బంగ్లాదేశ్లో మైనార్టీలపై జరుగుతున్న హింస రోజురోజుకీ మరింత భయంకర రూపం దాల్చుతోంది. మతపరమైన ఉద్రిక్తతలు, అఫవాలు, మూకల దాడులు అక్కడి మైనార్టీల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయి. తాజాగా మెమెన్ సింగ్ జిల్లాలో చోటుచేసుకున్న దారుణ ఘటన దేశవ్యాప్తంగానే కాక.. అంతర్జాతీయంగా కూడా తీవ్ర కలకలం రేపుతోంది. మైనారిటీ వర్గానికి చెందిన ఓ సాధారణ కార్మికుడిపై జరిగిన అమానుష దాడి, అనంతరం చేసిన అమానవీయ చర్యలు మానవత్వానికే మచ్చగా మారాయి.
🚨Horrific Lynching in Bangladesh:
A Hindu youth, Dipu Chandra Das, was lynched in public tonight on the highway in Dubaliapara, Bhaluka Upazila of Mymensingh, over alleged religious insult.😢 #Dhaka #Bangladesh #Bhaluka #DhakaUniversity pic.twitter.com/CTQ50oo7hh
— Fauzii (@fauzdar15) December 18, 2025
మెమెన్ సింగ్ జిల్లా భాలూక ప్రాంతంలో దీపూ చంద్ దాస్ అనే హిందూ యువకుడు స్థానికంగా ఓ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మహ్మద్ ప్రవక్తను అవమానించాడనే ఆరోపణలతో ఓ గుంపు అకస్మాత్తుగా అతనిపై దాడికి దిగింది. ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు ఉన్నాయో స్పష్టత లేకపోయినా, ఆవేశంతో కూడిన మూక అతనిని చుట్టుముట్టి విచక్షణారహితంగా కొట్టింది. తీవ్రంగా గాయపడిన దీపూ చంద్ దాస్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
అయితే, ఈ దారుణం అక్కడితో ఆగలేదు. మానవత్వాన్ని తుంగలో తొక్కిన ఆ గుంపు, మృతదేహాన్ని ఢాకా-మెమెన్ సింగ్ హైవేపై ఉన్న ఓ చెట్టుకు వేలాడదీసి నిప్పంటించింది. చుట్టూ చూస్తున్న వారు, కుటుంబ సభ్యులు ఎంతగా వేడుకున్నా ఎవ్వరూ స్పందించలేదు. ఒక మనిషి ప్రాణం పోయిన తర్వాత కూడా అతని శరీరాన్ని అవమానించిన తీరు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ మొత్తం ఘటనను కొందరు వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మరింత కలవరపాటుకు గురిచేస్తోంది.
ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే బంగ్లాదేశ్లోని మైనార్టీ వర్గాల్లో భయాందోళనలు పెరిగాయి. పోలీసులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్టు ప్రకటించినప్పటికీ, ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతుండటం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గతంలో కూడా మైనార్టీలపై దాడులు జరిగిన సందర్భాల్లో సరైన న్యాయం జరగలేదన్న అభిప్రాయం బలంగా ఉంది. అందుకే ఈసారి అయినా దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
సోషల్ మీడియాలో ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, బంగ్లాదేశ్లో మైనార్టీల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో, మతం పేరుతో ఇలాంటి మూకల హింస జరగడం అత్యంత ప్రమాదకర సంకేతమని వ్యాఖ్యానిస్తున్నారు. మైనార్టీలకు రక్షణ కల్పించడంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక భారత నెటిజన్లు, పలు సంఘాలు ఈ ఘటనపై భారత ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నాయి. బంగ్లాదేశ్లో మైనార్టీలపై జరుగుతున్న హింస అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించి, అక్కడి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా మైనార్టీల భద్రతకు స్పష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఒక మనిషి ప్రాణం విలువ, మతానికి అతీతమని, మానవ హక్కుల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా ఉండాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ALSO READ: Telangana: మరో శుభవార్త.. ఫ్రీగా సూపర్ స్పెషాలిటీ వైద్యం!





