
క్రైమ్ మిర్రర్, ఎల్బీనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, టౌన్ ప్లానింగ్ విభాగంలో అక్రమాలు పెచ్చులూడుతున్నాయి. బల్దియాలోని అధికారులు వ్యవస్థను పక్కదోవ పట్టించారని, ఎవరి దారిన వారు నడుస్తూ అధికార బాధ్యతలను విస్మరిస్తున్నారని ప్రజల్లో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
బల్దియా టౌన్ ప్లానింగ్ శాఖలోని అధికారులు “ఎవరికివారు యమునా తీరు” అన్నట్టు వ్యవహరిస్తూ, నిర్మాణ అనుమతుల పేరుతో భారీగా ముడుపులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. జీహెచ్ఎంసీ సర్కిల్ 3 పరిధిలో వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. అవినీతిని ఆశ్రయంగా చేసుకున్న అధికారులు ముడుపులు తీసుకొని వాటిని పట్టించుకోవడం లేదని ఆరోపణలు వచ్చాయి. దీంతో బల్దియా ఆదాయానికి వేల కోట్ల నష్టం వాటిల్లుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ శాఖలు చేతులెత్తేయడంతో అధికారులు తమ అధికార బలంతో అక్రమ సంపాదనకు తెరతీశారని విమర్శలు వినిపిస్తున్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో వారి అక్రమ వ్యవహారాలు బహిరంగమవుతున్నాయి.
ఇక, టౌన్ ప్లానింగ్ అధికారులకు జోనల్ స్థాయిలో అదనపు బాధ్యతలు అప్పగించడంతో వారి అక్రమ సంపాదనపై బహిరంగంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హయత్నగర్ ఏరియాలో టౌన్ ప్లానింగ్ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న అధికారి పై చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అనుమతులు లేకుండానే సెన్సిటివ్ ఏరియాలో వందల మంది రోగులకు వైద్యం అందించే ఆస్పత్రి సమీపంలో నిర్మాణాలు కొనసాగుతుండటం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
ఒకవేళ అగ్నిప్రమాదం లాంటి ప్రమాదకర పరిస్థితి తలెత్తితే బాధ్యత ఎవరిది? అధికారుల నిర్లక్ష్యమేనా? అనే ప్రశ్నలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు, ఈ అధికారుల పర్యవేక్షణ లోపాలను బహిరంగంగా ప్రశ్నిస్తూ, వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.