తెలంగాణరాజకీయం

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కుట్ర? ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు.

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని అన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడే ఇది జరిగిందంటూ ఆరోపించారు. ఢిల్లీలో ఉన్నప్పుడే తనపై కుట్రలు జరిగాయని కవిత తెలిపారు. మీడియాతో గురువారం ఎమ్మెల్సీ కవిత చిట్‌ చాట్ చేశారు. తన మీద పడి ఏడిస్తే మీకు ఏం వస్తుంది. ఆడబిడ్డ మీద ఏంటీ మీ ప్రతాపం అని ప్రశ్నించారు. కొంతమంది… పెయిడ్ ఆర్టిస్టులతో సోషల్ మీడియాలో తనపై దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనపైన లిక్కర్ కేసు ఆరోపణలు వచ్చి, జైలుకు వెళ్లినప్పుడే తాను పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్ కు చెప్పానని, కానీ కేసీఆర్ ను ఏం చేయలేక నీ మీద కేసులు పెడుతున్నారని చెప్పారని కవిత అన్నారు.

2019 లో పార్టీలో ఉన్న కోవర్ట్ లు తనను ఎంపీ గా ఓడించారని వెల్లడించారు. ఆ క్రమంలోనే తనకు జిల్లాలో ప్రోటోకాల్ ఉండాలని కేసీఆర్ తనకు ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగిందని చెప్పారు. కడుపులో బిడ్డను పెట్టుకుని కేసీఆర్ కోసం తెలంగాణ ఉద్యమంలో పని చేశానని చెప్పుకొచ్చారు. లీకు వీరులను పట్టుకోండి అంటే గ్రీకు వీరులు తనపై దాడి చేస్తున్నారని కవిత భగ్గుమన్నారు. మీ తెలివి ప్రతిపక్ష నేతలపై చూపించండి.. తన జోలికి వస్తే బాగుండదు.. తాను అసలే మంచిదాన్ని కాదు… కేసీఆర్ కు ఉన్న తిక్క తనకూ ఉందని అన్నారు. తనపై వస్తున్న తప్పుడు ఆరోపణలకు పార్టీ స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు. కేసీఆర్ కు తాను 100 పైగా లేఖలు రాశానన్నారు. తాను తండ్రికి తాను లేఖ రాస్తే తప్పేమిటని నిలదీశారు. అయినా తాను రాసిన లేఖలో తప్పేముందని ఆమె ప్రశ్నించారు. తన లేఖను లీక్ చేసిందెవరో చెప్పాలన్నారు కవిత. కేసీఆర్ వల్లనే బీఆర్ఎస్ రజతోత్సవ సభ సక్సెస్ అయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వారు కేసీఆర్ కంటే పెద్ద వాళ్ళు ఏమీ కాదని, కేవలం కేసీఆర్ మాత్రమే తనకు నాయకుడిని అంటూనే పార్టీలో కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప మరెవరి నాయకత్వాన్ని తాను అంగీకరించనని ఆమె పరోక్షంగా కేటీఆర్ కు చురకలంటించారు. కేటీఆర్‌ కు నోటీసులు వస్తే ఎందుకు నిరసనలు లేవని ప్రశ్నించారు. తనపై వస్తున్న తప్పుడు ఆరోపణలను పార్టీ ఎందుకు ఖండించడం లేదని ఆమె నిలదీశారు. పార్టీ చేయాల్సిన సగం పనులు జాగృతి తరపున తాను చేస్తున్నానని వెల్లడించారు. కాంగ్రెస్ తో రాయబారాలు చేసే అవసరం తనకు లేదన్న కవిత.. తనను కేసీఆర్ కు దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కేసీఆర్ నాయకత్వంలోనే తాను పనిచేస్తానని తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో నన్ను కావాలనే ఓడించారని కవిత ఆరోపించారు. తన లక్ష్యం సామాజిక తెలంగాణ అంటూనే తన లక్ష్యం కోసం అహర్నిశలు కృషి చేస్తానని చెప్పారు. ఆమె చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.

అంతే కాకుండా తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తాను ఎప్పుడూ పని చేయలేదని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు కవిత. టీడీపీకి ఎన్డీయే లో భాగస్వామ్యం ఉండడం తోనే తెలంగాణ పై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. అంతే కాకుండా ప్రజా భవన్ లో సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు భేటీ అయ్యాకే బనకచర్ల ప్రాజెక్టుకు రూపకల్పన జరిగిందన్నారు. 200 టీఎంసీల నీటిని అదనంగా ఏపీకి తరలించేందుకే బనకచర్ల ప్రాజెక్టును తెరపైకి తెచ్చారని పేర్కొన్నారు. అయితే బనకచర్ల ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి హస్తం లేకపోతే ఆ ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించాలని ఆమె డిమాండ్ చేశారు.

కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కలిసి తెలంగాణ పై కుట్రలు చేస్తున్నాయని అన్నారు. తనకు నీతులు చెబుతున్న బీఆర్ఎస్ నేతలు బనకచర్ల ప్రాజెక్టుపై కార్యాచరణ తీసుకోవాలని సూచించారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ ఏం కార్యాచరణ తీసుకుందని ఆమె ప్రశ్నించారు. ట్విట్టర్ లో పోస్టులు పెడితే పార్టీ నడుస్తుందా అని సూటిగా ప్రశ్నించారు. పార్టీ నాయకుల కాలేజీల పైకి బుల్డోజర్లు వస్తే అడ్డుకున్నామా ? అన్నారు. బీఆర్ఎస్ పార్టీలోని కొందరు నేతలు కాంగ్రెస్, బీజేపీ పార్టీ నేతలతో సఖ్యతగా ఉండడం నిజం కాదా అని నిలదీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button