Trump-Nirbharta Row: భారత్ అమెరికా మధ్య కీలక వాణిజ్య ఒప్పందం కుదిరింది. డీల్ జరగడం లేదనే కారణంతో భారత్ పై సుంకాలు విధించిన ట్రంప్ ఎట్టకేలకు గత్యంతరం లేక వెనక్కి తగ్గాల్సి వచ్చింది. చివరకు ప్రధాని మోడీకి ఫోన్ చేసి వాణిజ్య ఒప్పందం గురించి చర్చించారు. ట్రేడ్ డీల్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా కీలక అంశాలపై చర్చించారు. అనంతరం ట్రేడ్ డీల్ కు ఒకే చేశారు.
వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ విమర్శలు
భారత్తో వాణిజ్య ఒప్పందం కుదిరినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదట ప్రకటించడాన్ని ప్రస్తావిస్తూ.. ప్రధాని మోడీపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ సెటైర్లు వేశారు. ‘‘ఆపరేషన్ సిందూర్ ఆగినప్పుడు, రష్యా చమురు కొనుగోళ్లకు సంబంధించి.. ఇప్పుడు వాణిజ్య ఒప్పందాన్ని అమెరికా నుంచి ట్రంపే మొదట ప్రకటించారు. ట్రంప్తో మోడీ మాట్లాడిన విషయాన్ని కూడా అమెరికా రాయబారి ప్రకటించారు. మోడీ ప్రభుత్వ నిర్ణయాలను మన ప్రభుత్వం నుంచి కాకుండా.. అమెరికా అధ్యక్షుడి నుంచి భారత ప్రజలు తెలుసుకుంటున్నారు. మోడీ పూర్తిగా ట్రంప్కు లొంగిపోయారు. మోడీ ఆత్మ నిర్భరత కాదు.. ట్రంప్ నిర్భరత’’ అని విమర్శించారు.
కాంగ్రెస్ వ్యాఖ్యలపై నెటిజన్ల సటైర్లు
అటు జైరామ్ రమేష్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ప్రధాని మోడీ ఆలోచనలను కాంగ్రెస్ పార్టీ కనీసం అంచనా వేసే స్థితిలో లేదంటున్నారు. “మన గురించి మనం చెప్పుకోవడం కంటే, ఎదుటి వాళ్లు, అదీ ప్రపంచంలో అత్యంత బలవంతులం అని చెప్పుకునేవాళ్లు చెప్పడంలోనే అసలు కిక్ ఉంటుంది” అని కామెంట్స్ చేస్తున్నారు. “సొంత డబ్బా కొట్టుకోవడంలో కాంగ్రెస్ ను మించిన వాళ్లు ఎవరూ లేరు. కానీ, ఇప్పుడు భారత్ గొప్పదనం గురించి ప్రపంచం మాట్లాడుతుందనే విషయం ఆ పార్టీ మర్చిపోకూడదు” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. “అమెరికా భారత్ మీద పెత్తనం చెలాయించేందుకు ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. చివరకు ట్రంప్ భారత్ తో కాళ్ల బేరానికి రావాల్సి వచ్చిందనే విషయాన్ని మర్చిపోకూడదు” అని మరికొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.





