- కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
- కుక్కను కారులో పార్లమెంటు ప్రాంగణంలోకి తీసుకొచ్చిన రేణుక
- పార్లమెంట్ లోని ఎంపీలను కుక్కలు అడనడంపై నోటీసులు జారీ
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు జారీ అయింది. ఒక వీధి కుక్కను తన కారులో పార్లమెంటు ప్రాంగణంలోకి తీసుకురావడంతోపాటు ఎంపీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఈ నోటీసు జారీ చేశారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
శీతాకాల పార్లమెంటు సమావేశాల సందర్భంగా రేణుకా చౌదరి తాను రక్షించిన ఒక వీధి కుక్కను కారులో పార్లమెంటుకు తీసుకెళ్లారు. దీనిపై అక్కడున్న కొందరు సభ్యులు అభ్యంతరం తెలిపారు. పార్లమెంట్ లోపలికి ఎలాంటి పెంపుడు జంతువులను తీసుకురాకూడదని నిబంధనలు ఉన్నా, ఆమె ఉల్లంఘించారు. అంతేకాదు, పార్లమెంట్ లోపల కూర్చుకున్న కుక్కల కంటే, తాను తీసుకొచ్చిన కుక్క చాలా బెటర్ అని చెప్పుకొచ్చారు. లోపల కూర్చున్నవారే కరుస్తారని వీధి కుక్కలు కరవవని సర్టిఫికేట్ ఇచ్చింది.
ప్రివిలేజ్ నోటీసు ఇచ్చిన బీజేపీ ఎంపీలు
అటు నిబంధనలకు విరుద్ధంగా కుక్కను పార్లమెంట్ లోకి తీసుకురావడంతో పాటు ఎంపీలను కుక్కలు అని సంబోధించడం పట్ల బీజేపీ ఎంపీలు బ్రిజ్లాల్, ఇందుబాల గోస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. ఎంపీలపై ధిక్కారపూరిత, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ నెల 23 లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులు
ఈ అంశం ప్రివిలేజ్ కమిటీ ముందుకు వెళ్లగా.. గతవారం జరిగిన సమావేశాల్లో కమిటీ దీనిపై చర్చించిచారు. ఈ ఆరోపణలపై ఈ నెల 23లోగా రాతపూర్వక సమాధానమివ్వాలంటూ రేణుకా చౌదరికి నోటీసు ఇచ్చింది. రేణుకాచౌదరి కార్యాలయవర్గాలు స్పందిస్తూ.. పార్లమెంటరీ నిబంధనలు, సంప్రదాయాల ప్రకారం సమాధానమిస్తామని తెలిపాయి.
Read Also: రాహుల్ సభ్యత్వం రద్దు చేయండి, లోక్ సభ స్పీకర్ కు బీజేపీ లేఖ!
