
-
సీఎం వెంట ఉత్తమ్, పొంగులేటి, సీఎస్, డీజీపీ
-
ఎల్లంపల్లి, మెదక్లో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే
-
అనంతరం కామారెడ్డిలో వర్షాలపై సీఎం రేవంత్ సమీక్ష
క్రైమ్మిర్రర్, హైదరాబాద్: భారీ వర్షాలు కామారెడ్డి, మెదక్ జిల్లాలను అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా కామారెడ్డి పట్టణాన్ని వరదలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాల పట్ల తెలంగాణ యంత్రాంగం అప్రమత్తమైంది. వెంటనే సహాయ చర్యలకు శ్రీకారం చుట్టింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, సీఎస్, డీజీపీ ఉన్నారు. ఎల్లంపల్లి, మెదక్లోలో ఏరియల్ సర్వే ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలించారు. అనంతరం కామారెడ్డిలో అధికారులతో సమీక్ష సమావేశం చేపట్టారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్దంగా ఉండాలని ఆదేశించారు.
రంగంలోకి ఆర్మీ హెలికాప్టర్లు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరద ప్రవాహంలో ఐదుగురు చిక్కుకున్నారు. ఎగువమానేరు ప్రాజెక్టు సమీపంలో చిక్కున్న వీరిని ఆర్మీ హెలికాప్టర్ల సాయంతో అధికారులు కాపాడారు. పశువులను మేపేందుకు వెళ్లిన సమయంలో వరదలో చిక్కుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సిద్దిపేటలో పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ను వరద ముంచెత్తింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు కాలనీలు నీట మునగడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. వరద బాధితులు ఇళ్లను వదిలి పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు.