
CM Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంపై స్పష్టమైన సంకేతాలు ఇస్తూ ఆయన చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది. నిర్దిష్ట కాలపరిమితి ప్రకారం చూస్తే తెలంగాణ శాసనసభకు 2028 డిసెంబరులో ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ, వాస్తవానికి ఆ సమయానికి కాకుండా 2029లోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని సీఎం స్పష్టం చేశారు. దీంతో రాష్ట్ర రాజకీయ దిశపై కొత్త చర్చ మొదలైంది.
దేశవ్యాప్తంగా పార్లమెంట్తో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించే ‘జమిలీ ఎన్నికలు’ దిశగా కేంద్రం కసరత్తు చేస్తున్న నేపథ్యంలోనే ఈ మార్పు చోటుచేసుకుంటుందని ఆయన వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భావన ప్రకారం 2029లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహించే అవకాశముందని రేవంత్ వెల్లడించారు. ఈ ప్రకటనతో రాష్ట్ర రాజకీయ పార్టీల వ్యూహాలు కొత్త దిశలో సాగనున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
2029 నాటికి దేశవ్యాప్తంగా జనగణనలో కులగణన, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన, ఎంపీ సీట్ల సంఖ్య పెంపు, మహిళా రిజర్వేషన్ల అమలు వంటి అంశాలు ముందుకు రావచ్చని సీఎం విశ్లేషించారు. అయితే జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్ల పెంపు సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. కుటుంబ నియంత్రణ విధానాలను కట్టుదిట్టంగా అమలు చేసి జనాభా వృద్ధిని నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు ఇది అన్యాయం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా ఎక్కువగా ఉండటంతో అక్కడ సీట్లు పెరిగే అవకాశం ఉండగా, కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇప్పటికే ఆర్థిక పంపకాల విషయంలో దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతున్నారనే ఆరోపణల మధ్య, సీట్ల పునర్విభజనలో కూడా అసమానత చోటుచేసుకుంటే పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గిపోతుందని రేవంత్ హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రాల మధ్య ఉన్న సీట్ల తేడాను అలాగే కొనసాగిస్తూ సమతుల్య సర్దుబాటు చేయాలని సూచించారు. లేనిపక్షంలో కేంద్రం దక్షిణాది రాష్ట్రాల మద్దతు అవసరం లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుందని, తద్వారా నిధులు, గ్రాంట్లు, కేంద్ర సహాయాల విషయంలో నిర్లక్ష్యం పెరిగే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర అభివృద్ధి విషయంలో మాత్రం కేంద్ర నిధులు వచ్చినా రాకపోయినా తెలంగాణ ప్రగతి ఆగదని సీఎం స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో ప్రతిపక్ష పార్టీ భారత రాష్ట్ర సమితి నేతలపై కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. జైలుకు వెళ్లితేనే ముఖ్యమంత్రి అవుతామనే ఒక రాజకీయ భావన వ్యాప్తి చెందిందని, గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు జైలుకు వెళ్లిన తర్వాత ముఖ్యమంత్రులయ్యారనే ఉదాహరణను ప్రస్తావించారు. అందుకే ఇప్పుడు కొందరు నాయకులు కూడా అదే మార్గాన్ని అనుసరించాలని చూస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ముఖ్యంగా కేటీఆర్, హరీశ్రావులపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
ఇక జిల్లాల పునర్విభజనపై కూడా సీఎం స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాల రద్దు లేదా కొత్త జిల్లాల ఏర్పాటు అనే అంశంపై ఎలాంటి ఆలోచన లేదని తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం 2026 జనవరి 1 నుంచి 2027 మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు వంటి పరిపాలనా హద్దుల్లో మార్పులు చేయకూడదని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో, తక్షణమే జిల్లాల పునర్విభజన సాధ్యం కాదని వివరించారు. దీంతో జిల్లాల విభజనపై కొనసాగుతున్న చర్చలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టయింది.
ALSO READ: Sinkhole: అకస్మాత్తుగా భూమిలోకి కుంగిపోయి, అదృశ్యమైన రోడ్డు









