
Pahalgam Tourists: జమ్మూకాశ్మీర్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పహల్గామ్ కు పర్యాటకులు పోటెత్తారు. రోడ్ల మీద పర్యాటకుల వాహనాలు బారులుతీరాయి. పర్యాటకులను చూసి సీఎం ఒమర్ అబ్దుల్లా సంతోషం వ్యక్తం చేశారు. టూరిస్టులకు సంబంధించిన ఫోటోలను ఆయన షేర్ చేశారు.
ఉగ్రదాడి తర్వాత 50 రోజులకు పార్కుల ఓపెన్
మినీ స్విట్జర్లాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న పహల్గామ్ లోని బైసరాన్ వ్యాలీలో గత నెలలో ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. పర్యాటకులే లక్ష్యంగా బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ ఘనటలో ఏకంగా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి తర్వాత జమ్మూకాశ్మీర్ కు వెళ్లేందుకు పర్యాటకులు భయంతో వణికిపోయారు. పర్యాటక ప్రాంతాలు టూరిస్టులు లేక వెలవెలబోయాయి. ఉగ్రదాడి జరిగి సుమారు 50 రోజుల తర్వాత పహల్గామ్ సహా కాశ్మీర్ లోని పలు పార్కులు ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు మళ్లీ అక్కడ సందడి వాతావారణం నెలకొంది. పెద్ద సంఖ్యలో పర్యాటకులు క్యూ కడుతున్నారు.
టూరిస్టుల ఫోటోలు షేర్ చేసిన ఒమర్ అబ్దుల్లా
పర్యాటకులు మళ్లీ పహల్గామ్ బాటపట్టడంపై జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంతోషం వ్యక్తం చేశారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి తరలి వచ్చిన పర్యాటకులు పహల్గామ్ లో చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపారు. జమ్మూకాశ్మీర్ లో పర్యాటక రంగం అభివృద్ధికి తాము చేస్తున్న కృషికి ఫలితం దక్కుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ మేరకు టూరిస్టుల వాహనాలు బారులు తీరిన ఫోటోలను ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఉగ్రవాదులకు వణుకుపుడుతోందని, ఇక జమ్మూకాశ్మీర్ పర్యాటక రంగానికి ఏమాత్రం ఢోకా లేదంటున్నారు నెటిజన్లు.
Read Also: పహల్గామ్ లో మళ్లీ తెరుచుకున్న పర్యాటక ప్రాంతాలు, టూరిస్టులు వచ్చేనా?