CJ Roy Death Probe: కాన్ఫిడెంట్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ సీజే రాయ్ ఆత్మహత్య కేసు దర్యాప్తు కోసం కర్ణాటక ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. ఈ సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై హోం మంత్రి పరమేశ్వర్ కీలక విషయాలు వెల్లడించారు. ఐటీ అధికారులు గతంలోనూ రాయ్ కంపెనీలపై దాడులు జరిపారని, 2025 డిసెంబరులో ఐటీ దాడి జరిగిందని, 60 రోజుల్లోగా చార్జ్షీట్ దాఖలు చేయాల్సి ఉందని తెలిపారు. ఐటీ అధికారులను విచారించాలని, అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని రాష్ట్ర ఐటీబీటీ శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే అన్నారు.
తుపాకీతో కాల్చుకుని రాయ్ ఆత్మహత్య
రియల్ ఎస్టేట్ సంస్థ కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ అయిన సీజే రాయ్ శుక్రవారం బెంగళూరులో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తన కార్యాలయంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన కొద్ది గంటలకే ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. రాయ్ తనను తాను తుపాకీతో కాల్చుకున్నారని, ఆయనకు వైద్య సహాయం అందించినప్పటికీ మరణించినట్టు ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి.
ఆత్మహత్యకు కారణాలు తేల్చనున్న సిట్
అయితే ఆయన ఆత్మహత్యకు గల కారణం తెలియరాలేదు. రాయ్ ఆత్మహత్యపై ఐటీ శాఖ ఇంతవరకు స్పందించ లేదు. కాన్ఫిడెంట్ గ్రూప్ దక్షిణాదిలో ఎక్కువగా వ్యాపారం చేస్తున్నది. ఐటీ అధికారుల వేధింపుల కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. పదే పదే తనతో పాటు తన కుటుంబ సభ్యులను విచారణ, సోదాలు అంటూ ఇబ్బందులు పెట్టడంపై ఆవేదన చెంది సూసైడ్ చేసుకున్నట్లు ఆయన బంధువులు ఆరోపిస్తున్నారు. సిట్ ఆయన ఆత్మహత్యకు సంబంధించి అసలు విషయాలను వెలుగులోకి తీసుకురానుంది.





