Chinese Media On Putin India Visit: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనను చైనా మీడియా బాగా హైలెట్ చేసింది. ఈ పర్యటనతో భారత్- రష్యా సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆకాంక్షించింది. రష్యాపై అమెరికా, యూరోపియన్ దేశాల ఆంక్షలు, భారత్పై అడ్డగోలు టారిఫ్ లు, రష్యాతో వాణిజ్యాన్ని తగ్గించాలన్న తీవ్ర ఒత్తిడులు కొనసాగుతున్న సమయంలో.. పుతిన్ భారత పర్యటన ప్రపంచానికి స్పష్టమైన సందేశం పంపిందని వెల్డించింది. భారత్, రష్యాల్లో ఏ దేశమూ ఒంటరికాదని ఈ పర్యటన తేల్చిచెప్పిందని వ్యాఖ్యానించింది. ఈ పర్యటనపై చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ సహా పలు పత్రికలు కథనాలు ప్రచురించాయి. ఇక భారత్-రష్యా మధ్య బంధం అత్యంత వ్యూహాత్మకమైనదని.. బయటి ఒత్తిళ్లకు, జోక్యానికి ప్రభావితమయ్యేది కాదని చైనా విదేశాంగ వ్యవహారాల యూనివర్సిటీ ప్రొఫెసర్ లీ హైడాంగ్ వెల్లడించారు.
చైనా మీడియాలో భారత్ పై ఎందుకు సాఫ్ట్ కార్నర్?
భారత్ పై ఎప్పుడూ నెగెటివ్ ధోరణి కలిగి ఉండే చైనా మీడియాలో ఒక్కసారిగా పాజిటివ్ నెస్ రావడానికి కారణం ఏంటని సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. దీనికి వెనుక కారణం లేకపోలేదు. రీసెంట్ గా చైనాలోని తియాజ్ జిన్ వేదికగా 25వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు జరిగింది. జిన్పింగ్ అధ్యక్షతన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ప్రధాని మోడీ, పుతిన్ సహా వివిధ దేశాధినేతలు హాజరయ్యారు.
భారత్ కు దగ్గరవుతున్న చైనా
షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సుకు కొద్ది రోజుల ముందే అమెరికా భారత్ మీద 50 శాతం టారిఫ్ విధించింది. చైనాపై అమెరికా ఎప్పుడూ వ్యతిరేక ధోరణిలోనే ఉంటుంది. అడ్డగోలు టారిఫ్ లతో భారత్ ను దూరం పెట్టే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో చైనా, భారత్ దగ్గరయ్యాయి. తియాజ్ జిన్ లో మోడీ, జిన్ పింగ్ సమావేశమై.. సరిహద్దు వివాదాల పరిష్కారం సహా, ఇరు దేశాల మధ్య విమాన సర్వీసుల పునః ప్రారంభంపై చర్చలు జరిపారు. ఈ భేటీ తర్వాత రెండు దేశాల మధ్య పాజిటివ్ ధోరణి మొదలయ్యింది. ఈ నేపథ్యంలోనే పుతిన్ భారత పర్యటనను చైనా మీడియా బాగా హైలెట్ చేసింది.





