
ఇరాన్ పై అమెరికా దాడులు చేసిన నేపథ్యంలో చైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇరాన్ భూగర్భంలో ఉన్న అణు క్షేత్రాలను ధ్వంసం చేసేందుకు అమెరికా వేసిన బాంబులు ఏమాత్రం సరిపోవని చైనా అభిప్రాయపడింది. ఫోర్డు అణు స్థావరం భూగర్భంలో ఏకంగా 100 మీటర్ల లోతులో ఉందని వెల్లడించింది. బంకర్ బస్టర్ బాంబులు వాడినా ఒకటి రెండు దాడులతో దీనిని పూర్తిగా ధ్వంసం చేసే పరిస్థితి లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు చైనా అంతర్జాతీయ అధ్యయన సంస్థ పరిశోధకుడు లి జిక్సిన్ కీలక విషయాలు వెల్లడించారు. గ్లోబల్ టైమ్స్ కు రాసిన వ్యాసంలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు.
బంకర్ బస్టర్ సామర్థ్యం 65 మీటర్లు!
అమెరికా ఉపయోగించిన బంకర్ బస్టర్ బాంబు తన సామర్థ్యంతో 65 మీటర్లు చొచ్చుకెళ్లే అవకాశం ఉందని చైనా సైనిక వ్యవహారాల నిపుణుడు జాంగ్ జున్షే వెల్లడించారు. ఒకదాని తర్వాత మరొకటి వేయడం వల్ల 100 మీటర్ల లోతుకు వెళ్లే అవకాశం ఉందని భావించినప్పటికీ, ఇంత వరకు ఇలా చేసిన దేశం ఏదీ లేదని వెల్లడించారు. అమెరికా చెప్పినట్లు ఫోర్డు స్థావరం మీద దాడి చేసినా ధ్వంసం చేసిందని చెప్పలేమన్నారు. అయితే, ఇజ్రాయెల్ వాడు ఎఫ్-15, 16, 35 ఫైటర్ జెట్ల కంటే బి-2 బాంబర్లు చాలా పవర్ ఫుల్ అని చెప్పుకొచ్చారు. అమెరికా కలిగించిన నష్టం మాత్రం ఎక్కువేనని తెలిపారు. మున్ముందు కూడా ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడులు కొనసాగే అవకాశం ఉన్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు.
అమెరికా తీరు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే!
అటు చైనా ప్రభుత్వ ఆధీనంలోని ‘గ్లోబల్ టైమ్స్’ అమెరికా దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా తీరు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే అవుతుందని అభిప్రాయపడింది. ఇలాంటి తీరుతో అంతర్జాతీయ వ్యవస్థను తుంగలో తొక్కినట్లు అవుతుందని వెల్లడించింది. బలవంతుడితే సామ్రాజ్యం అనే ప్రమాదకర తీరుకు అద్దం పడుతుంది. ఇలాంటి దాడులు పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉందని వెల్లడించింది.
Read Also: మోడీకి ఇరాన్ ప్రెసిడెంట్ ఫోన్.. ప్రధాని తీవ్ర ఆందోళన!