Heartwarming Story from Chhattisgarh: ఛత్తీస్గఢ్లో హృదయాన్ని తాకే సంఘటన చోటుచేసుకుంది. కాంకేర్ జిల్లా అడవుల నుంచి వచ్చిన ముగ్గురు మావోయిస్టులు.. కుంజం రాధిక, కడియం సందీప్, పద్మ లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 28న వారు పార్తాపుర్ గ్రామానికి చేరుకున్నారు. అక్కడికి చేరేసరికి వారు చాలా ఆకలితో అలమటిస్తున్నారని భద్రతా బలగాలు గమనించాయి.
మానవత్వాన్ని చూపించిన ఎస్సై రామేశ్వర్
వారి పరిస్థితిని చూసిన పార్తాపుర్ ఎస్సై రామేశ్వర్ చతుర్వేది మానవత్వాన్ని చూపించారు. వెంటనే వారికి భోజనం ఏర్పాటు చేసి, వారితో కలిసి కూర్చుని తిన్నారు. ఆ క్షణం అక్కడ ఉన్నవారందరినీ కదిలించింది. గతంలో ఒకరిపై ఒకరు తుపాకులు ఎత్తినవాళ్లు.. ఈ రోజు ఒకే గిన్నెలో అన్నం పంచుకోవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, మానవత్వం ఇంకా బతికే ఉందనే భావనను ప్రజల్లో కలిగించింది.
భోజనం చేసిన అనంతరం లొంగుబాటు
భోజనం అనంతరం ఆ ముగ్గురు మావోయిస్టులు స్వచ్ఛందంగా పోలీసుల ముందు లొంగిపోయారు. ఆపరేషన్ కగార్ వల్ల ఇలాంటి శాంతిపూర్వ మార్పులు వస్తున్నాయని పలు అభిప్రాయపడుతున్నారు.
మరోవైను ఎన్కౌంటర్లు
మరోవైపు, అదే రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పోలంపల్లి అటవీ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. అతడిని ప్లాటూన్ నెంబర్ 31 కమాండర్ కైలాస్గా పోలీసులు గుర్తించారు. అతడిపై రూ.5 లక్షల రివార్డు ఉందని అధికారులు తెలిపారు. ఘటనాస్థలంలో ఒక తుపాకిని కూడా స్వాధీనం చేసుకున్నారు.
