
హైదరాబాద్, జూన్ 30 (క్రైమ్ మిర్రర్): తెలంగాణ బీజేపీలో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంటూ పార్టీ అధ్యక్ష పదవిపై వినూత్న పరిణామాలకు తెరతీసింది. పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవి కోసం బీజేపీ సీనియర్ నేత ఎన్. రామచందర్ రావు పేరును ఖరారు చేసింది. విశేషం ఏమిటంటే.. రామచందర్ రావు ఆంధ్రప్రదేశ్ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ఇది ప్రత్యక్షంగా ఈటల రాజేందర్కు చెక్ వేసినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈటలకి తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా ప్రచారం సాగుతుండగా, చివరకు అధిష్టానం దానికి భిన్నంగా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. బీజేపీ సీనియర్ నాయకుడైన రామచందర్ రావును నామినేట్ చేయాలని, అధ్యక్ష పదవి కోసం పోటీకి నిలిపేందుకు ఢిల్లీ అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్టు సమాచారం.
పార్టీ వర్గాల్లో చర్చ : ఇక ఈ పరిణామాలపై పార్టీ అంతర్గతంగా కూడా వివిధ చర్చలు జరుగుతున్నాయి. చంద్రబాబుతో గాఢమైన అనుబంధం ఉన్న వ్యక్తికి అధ్యక్ష పగ్గాలు ఇవ్వడం ద్వారా బీజేపీ – టీడీపీ మధ్య భవిష్యత్తులో మరింత పొత్తు ముద్రపడే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈటల విభాగం అసంతృప్తి? : ఈ నిర్ణయంతో ఈటల రాజేందర్ వర్గం అసంతృప్తిగా ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. రాష్ట్ర బీజేపీని సమన్వయం చేయడానికి, బలపరచడానికి తాను సిద్ధమని ఈటల ఇప్పటికే పలు సార్లు హైకమాండ్ కు తెలియజేశారు. కానీ చివరకు అధిష్టానం రామచందర్ రావు వైపు మొగ్గుచూపడం తో తెలంగాణ బీజేపీలో కొత్త రాజకీయ సవాళ్లు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.