
ఏదైనా ప్రైవేటీలో కంపెనీలో ఉద్యోగులు సరిగా పనిచేయకపోతే ఏం చేస్తారు. సస్పెండ్ చేస్తారు. లేదా ఉద్యోగం నుంచి తీసేస్తారు. కానీ.. ఓ మార్కెటింగ్ కంపెనీ మాత్రం.. ఉద్యోగుల పట్ల దారుణంగా వ్యవహరించింది. ఇచ్చిన టార్గెట్లు పూర్తిచేయలేదని… అమానవీయంగా ప్రవర్తించింది. వారిని కుక్కలా ట్రీట్ చేసింది. కాళ్లు, చేతులకు గొలుసులు కట్టి… కుక్కల్లా మోకాళ్లపై నడిపించి… నేలపై పడేసిన నాణేలను నాలుకతో తీయించి… అబ్బా.. చెప్పడానికి చాలా దారుణంగా ఉంది. మరి అలాంటి శిక్షలు ఎలా వేశారో ఏమో..?
కేరళలోని కలూరుకు చెందిన ప్రైవేట్ మార్కెటింగ్ కంపెనీలో ఈ ఘటన జరిగింది. పనితీరు సరిగాలేదని ఉద్యోగులకు దారుణమైన శిక్షలు విధించింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. విషయం బయటపడింది. కంపెనీ తీరుపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేరళ ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యింది. ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శివన్కుట్టి… ఘటనపై విచారణకు ఆదేశించారు. తక్షణం నివేదిక ఇవ్వాలని కోరారు. మరోవైపు పోలీసులు కూడా ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు.
Also Read : రాజాసింగ్ జై శ్రీరామ్ శోభాయాత్ర.. పాతబస్తీలో హై టెన్షన్
ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు… కొందరు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. టార్గెట్లు రీచ్ కానివారికి అలాంటి శిక్షలు విధించారని చెప్పారు. నేలపై పాకడం వంటి అవమానకరమైన శిక్షలను తరచూ వేస్తుంటారని చెప్పారు. కేరళ కార్మిక శాఖ మంత్రి శివన్కుట్టి ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన చాలా షాకింగ్గానూ, బాధగాను అనిపించిందని చెప్పారు. తమ రాష్ట్రంలో ఇలాంటి చర్యలను ఉపేక్షించబోమని చెప్పారాయన. కల్లూరుకు చెందిన కంపెనీ యాజమాన్యం మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తోంది. తమ ఉత్పత్తులను మార్కెట్ చేసే పెరుంబవూర్లోని వేరే కంపెనీలో ఈ వేధింపులు జరిగి ఉండవచ్చని చెప్తోంది. ఇందులో తమ ప్రమేయం లేదని చెప్తోంది. ఓ ఉద్యోగి మాత్రం… తమ కంపెనీలో అలాంటి వేధింపులు, శిక్షలు ఏమీ లేవని… సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు కొన్ని నెలల కిందటివని.. అప్పట్లో ఉన్న మేనేజర్ అలా చేశాడని చెప్పారు.
Also Read : అయోధ్యలో వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు
అయితే… యాజమాన్యం ఆయన్ను తొలగించడంతో… ఆ వీడియోలను కావాలనే బయటపెడుతున్నారని అంటున్నాడు. ఏది ఏమైనా… ఈ ఘటనకు సంబంధించి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. కోర్టు లాయర్ కులత్తూరు జైసింగ్ ఫిర్యాదుతో కేరళ మానవహక్కుల సంఘం కూడా కేసు నమోదు చేసింది. కేరళ రాష్ట్ర యూత్ కమిషన్ కూడా విచారణ ప్రారంభించింది. జిల్లా పోలీసు అధికారిని నివేదిక కోరింది. నాగరిక, ప్రజాస్వామ్య సమాజంలో అమోదయోగ్యం కాదని అన్నారు. ఈ ఘటనలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది.