
Cattle Care: పాడి పెంపకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా నిలుస్తున్న రంగం. రైతుల కుటుంబాలకు నిత్యాదాయాన్ని అందించే ప్రధాన వనరుగా పశుసంపద కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఇటీవలి కాలంలో వాతావరణ మార్పులు, తేమ ఎక్కువగా ఉండటం, పశువుల షెడ్ల పరిశుభ్రత లోపించడం వంటి కారణాలతో ఈగలు, దోమలు తీవ్రంగా విస్తరిస్తున్నాయి. ఈ చిన్న కీటకాల బెడద పెద్ద నష్టాలకు దారితీస్తోందని పాడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశువుల రక్తాన్ని పీల్చే దోమలు, శరీరంపై గుంపులుగా వాలే ఈగలు పశువులను నిరంతరం అసహనానికి గురిచేస్తున్నాయి. దీని ప్రభావం నేరుగా పాల ఉత్పత్తిపై పడుతోంది. ప్రశాంతంగా మేత తినలేకపోవడం, రాత్రివేళ నిద్రపోకపోవడం, తరచూ తోక ఊపుతూ, కాళ్లతో తన్నుకుంటూ ఈగలను తరిమే ప్రయత్నం చేయడం వంటివి పశువుల్లో సాధారణంగా కనిపిస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో పశువుల శక్తి వృథా అవుతూ, బలహీనత పెరుగుతోంది. పాల దిగుబడి తగ్గిపోవడమే కాకుండా, కొన్నిసార్లు చర్మంపై గాయాలు, కురుపులు, ఇన్ఫెక్షన్లు కూడా ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా పాలు పితికే సమయంలో ఈగల కారణంగా పశువులు అసహనంగా కదలడం వల్ల రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా దోమల ద్వారా వ్యాపించే కొన్ని రోగాలు కూడా పశువుల ఆరోగ్యానికి ప్రమాదంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు రసాయన ఆధారిత పురుగుమందులను వినియోగిస్తున్నప్పటికీ, అవి తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తున్నాయని చెబుతున్నారు. పశువులు ఆ మందులను నాకడం వల్ల విషప్రభావాలు, అలర్జీలు, ఇతర దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉందనే భయం కూడా వ్యక్తమవుతోంది.
ఈ సమస్యకు సహజమైన, సురక్షితమైన పరిష్కారంగా అనుభవజ్ఞులైన ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్న ఒక సులభ గృహచిట్కా ప్రస్తుతం పాడి రైతుల్లో ఆదరణ పొందుతోంది. వెనిగర్, ఉప్పు, కర్పూరం వంటి సాధారణ పదార్థాలతో తయారు చేసే ఈ సహజ ద్రావణం ఈగలు, దోమలను దూరం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని రైతులు చెబుతున్నారు. మూడు లీటర్ల నీటిలో 50 మిల్లీలీటర్ల వెనిగర్, 50 గ్రాముల ఉప్పు కలిపి బాగా మరిగించి, నీరు సగానికి తగ్గిన తర్వాత చల్లబరచాలి. అనంతరం 10 గ్రాముల కర్పూరం పొడి చేసి కలిపి, శుభ్రమైన గుడ్డతో వడకట్టి స్ప్రే బాటిల్లో నింపుకోవాలి. ఈ విధంగా తయారైన ద్రావణాన్ని రోజుకు రెండు నుంచి మూడు సార్లు పశువుల శరీరంపై పిచికారీ చేస్తే ఈగలు, దోమలు దరిచేరవని చెబుతున్నారు.
పురుగుమందుల పంపుల శబ్దం పశువులను భయపెట్టే అవకాశం ఉన్నందున సాధారణ స్ప్రే బాటిల్ వినియోగించడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ద్రావణం పూర్తిగా సహజ పదార్థాలతో తయారైనందున పశువులు నాకినా హాని కలగదని రైతులు చెబుతున్నారు. ద్రావణంలోని ప్రత్యేక వాసన ఈగలు, దోమలను దూరంగా ఉంచుతుంది. కేవలం పశువులకే కాకుండా, గోశాల పరిసరాల్లో, ఇళ్లలో కూడా ఈ ద్రావణాన్ని ఉపయోగించవచ్చని సూచిస్తున్నారు. తక్కువ ఖర్చుతో, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా లభించే ఈ పద్ధతి పాడి రైతులకు పెద్ద ఊరటగా మారుతోంది. రెండు రోజులకు ఒకసారి క్రమం తప్పకుండా వినియోగిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని అనుభవజ్ఞులు పేర్కొంటున్నారు.
ఇక మరో సహజ పరిష్కారంగా వెల్లుల్లి వినియోగాన్ని వెటర్నరీ వైద్యులు ప్రోత్సహిస్తున్నారు. వెల్లుల్లిలో ఉండే ‘అల్లియిన్’ అనే సమ్మేళనం పశువుల శరీరంలో ‘అల్లిసిన్’గా మారుతుంది. ఈ అల్లిసిన్ పశువుల చెమట గ్రంధుల ద్వారా బయటకు విడుదలవుతూ ప్రత్యేకమైన వాసనను సృష్టిస్తుంది. ఆ వాసన ఈగలను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది కీటకాలను చంపదు కానీ పశువుల శరీరంపై వాలకుండా నిరోధిస్తుంది. బయట వాతావరణంలో ఎంతమంది ఈగలు ఉన్నప్పటికీ పశువులకు నేరుగా ఇబ్బంది కలగకుండా చూడడంలో ఇది సహకరిస్తుంది.
వెల్లుల్లిని పశువులకు గార్లిక్ పౌడర్ రూపంలో లేదా పచ్చి వెల్లుల్లి గడ్డల రూపంలో ఇవ్వవచ్చు. మినరల్ మిక్చర్తో కలిపి 1 నుంచి 2 శాతం వరకు గార్లిక్ పౌడర్ కలపడం లేదా ప్రతి పశువుకు రోజుకు 2 నుంచి 3 గ్రాముల గార్లిక్ పౌడర్ ఇవ్వడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. గార్లిక్ పౌడర్ అందుబాటులో లేకపోతే రోజుకు ఒక వెల్లుల్లి గడ్డ దంచి దానాలో కలిపి ఇవ్వవచ్చు. ఈగల సమస్య ఎక్కువగా ఉండే కాలానికి పది రోజుల ముందే వెల్లుల్లి వినియోగం ప్రారంభించి, ఆ కాలం ముగిసే వరకు కొనసాగిస్తే మెరుగైన ఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు.
వెల్లుల్లి వినియోగంతో పశువులు ప్రశాంతంగా ఉండటంతో పాల దిగుబడి సుమారు 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అనుభవాలు చెబుతున్నాయి. ఈగల కుట్టులతో వచ్చే చర్మవ్యాధులు తగ్గి, మందుల ఖర్చు కూడా తగ్గుతుంది. ముఖ్యంగా మాస్టిటిస్ వంటి వ్యాధులను నియంత్రించడంలో కూడా వెల్లుల్లి ఉపయుక్తమని వెటర్నరీ నిపుణులు పేర్కొంటున్నారు. రసాయనాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గి, పశువుల ఆరోగ్యం సహజంగా మెరుగుపడుతుంది. పాలలో వెల్లుల్లి వాసన వస్తుందనే అపోహలు ఉన్నప్పటికీ, అల్లిసిన్ చర్మం ద్వారా బయటకు వస్తుందని, పాల నాణ్యతపై ప్రభావం ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పశువులు వెల్లుల్లిని ఇష్టంగా తింటాయని, వాటికి ఎలాంటి అసౌకర్యం ఉండదని రైతులు చెబుతున్నారు.
సహజ పద్ధతులను అనుసరించడం ద్వారా పాడి రైతులు తమ పశుసంపదను కాపాడుకోవడమే కాకుండా, పాల ఉత్పత్తిని పెంచుకుని ఆర్థిక లాభాలను పొందవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ ఖర్చుతో, సురక్షితంగా, దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే ఈ పద్ధతులు గ్రామీణ స్థాయిలో విస్తృతంగా అమలైతే పాడి రంగానికి కొత్త ఊపు వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ALSO READ: Rajasaab: మళ్లీ ట్రోల్స్.. మొత్తం సినిమా డూప్లతోనే తీశారా?









