
రామకృష్ణాపూర్,క్రై మిర్రర్:- రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నేపథ్యంలో క్యాతనపల్లి గడ్డపై గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్,సీపీఐ తమ వ్యూహాలకు పదును పెట్టాయి. క్యాతనపల్లిలోని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నివాసంలో బీఆర్ఎస్, సీపీఐ ఉమ్మడి పొత్తులో భాగంగా కీలక సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కలవేన శంకర్తో పాటు 22 వార్డుల అభ్యర్థులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు ప్రచార వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ, పొత్తులో భాగంగా పోటీ చేస్తున్న అభ్యర్థులంతా ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

టికెట్ లభించని వారిని పక్కన పెట్టకుండా ప్రచారంలో భాగస్వాముల్ని చేయాలని సూచించారు. ఎన్నికల ప్రచారంలో సంయమనం పాటించాలని, ప్రతి ఓటరును గౌరవిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించాలని తెలిపారు.విజయం సాధించాలంటే ఓటర్ల మ్యాపింగ్ కీలకమని నాయకులు ఆయన స్పష్టం చేశారు. స్థానిక, బయటి ఓటర్ల జాబితాలను వేర్వేరుగా సిద్ధం చేసి పోలింగ్ రోజున వారిని రప్పించేలా సమన్వయం చేయాలని సూచించారు. చదువుకున్న యువతకు సోషల్ మీడియా, పేపర్ వర్క్ బాధ్యతలు అప్పగించాలని తెలిపారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో క్యాతనపల్లిలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను “కన్నీరు పెడుతున్న క్యాతనపల్లి” కరపత్రాలు, “బాకీ కార్డుల” ద్వారా ఎండగట్టాలని అభ్యర్థులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే భావసారూప్యత కలిగిన పార్టీతో ముందుకు సాగుతున్నామని బాల్క సుమన్అన్నారు.వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేశారు. సింగరేణి భవిష్యత్తు అంధకారంలో పడిందని, ఎన్నికల హామీలు అమలు కాలేదని ఆరోపించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో రెండేళ్లుగా అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు.పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు క్యాతనపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరైన అవకాశం ఉందని నేతలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, బీఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గ నాయకులు డాక్టర్ రాజా రమేష్ ,నాయకులు రామిడి కుమార్,22 వార్డుల అభ్యర్థులు,ప్రజలు పాల్గొన్నారు.





