•ప్రమాదంలో గాయపడ్డ బాధితుల,కార్మికుల వివరాలు వెల్లడించాలి…
పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు చెల్లించాలి…
•బృందావన్ రసాయన పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి…
•ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలి…
•సీపీఎం జిల్లా కార్యదర్శి యండి జహంగీర్
•సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం
చౌటుప్పల్, క్రైమ్ మిర్రర్: చౌటుప్పల్ మండలం,ఏళ్ళగిరి గ్రామ పరిధిలోని బృందావన్ లేబోరేటరీ పరిశ్రమలో శుక్రవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలనీ సిపిఎం జిల్లా కార్యదర్శి యండి జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏళ్లగిరి గ్రామ పరిధిలోని బృందావన్ పరిశ్రమలో శుక్రవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని శనివారం సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం స్థానిక నాయకత్వంతో కలిసి పరిశీలించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం వారు మాట్లాడుతూ.. అంత పెద్ద ప్రమాదం జరిగిన ప్రమాద ఘటనలో ఎవరు చనిపోలేదని యాజమాన్యం చెప్తున్న మాటలు నమ్మశక్యంగా లేవని అన్నారు. కానీ ఘటన స్థలంలో పెద్ద పెద్ద శిధిలాలు ఉన్నాయని అన్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఆసమయంలో డ్యూటీలో ఉన్న కార్మికుల సమాచారాన్ని ప్రమాద సమయం అనంతరం బయటికి వచ్చిన కార్మికుల సమాచారాన్ని బహిర్గత పర్చాలని డిమాండ్ చేశారు. కొంత మందికి గాయాలు అయినట్టు తెలుస్తున్నదని వారి వివరాలను సైతం బహిర్గత పర్చాలని డిమాండ్ చేశారు.ప్రమాద ఘటనపై అనేక అనుమానాలు ఉన్నాయని వ్యక్తం చేశారు.
పరిశ్రమలలో తనిఖీలు నిర్వహించడం లేదు:సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం
బృందావన్ రసాయన పరిశ్రమంలో జరిగిన ప్రమాద ఘటనపై సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడుతూ… సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాద ఘటన మరవక ముందే రాష్ట్రంలో ఈ లాంటి ఘటనలు పునరావృతం జరుగుతున్న ప్రభుత్వం ,అధికారులు పరిశ్రమలో తనిఖిలు నిర్వహించడం లేదని విమర్శించారు. ఘటన జరిగక ముందే కార్మిక శాఖ అధికారులు , ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ తనికులు నిర్వహించి ఉంటే ఇలాంటి ఘటనలు జరిగేవి కావని అన్నారు.అధికారుల అలసత్వం వహిస్తున్నారని, అధికారులు తనిఖీల బాధ్యత మరిచారని విమర్శించారు. ప్రమాద ఘటన నుండి కోలుకొని పరిశ్రమ నడిచే వరకు పరిశ్రమలో పనిచేస్తున్న 200 మంది కార్మికులకు వేతనం యాజమాన్యమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిశ్రమ చుట్టుపక్కల గ్రామాలైన అంతమ్మ గూడెం ,ధర్మోజీగూడెం గ్రామాలలో ప్రమాద శబ్దానికి ప్రజలు బయటికి పరుగులు తీశారని ,ఇళ్ళలో పగుళ్లు వచ్చాయని వీటన్నిటికి బాధ్యత యాజమాన్యం వహించాలని డిమాండ్ చేశారు. ప్రమాదాలు జరిగిన ప్రతి చోట పరిశ్రమల యాజమాన్యాలు భద్రతా చర్యలు కట్టుదిట్టం చేస్తామని హామీలుస్తున్న అవి అమలకు నోచుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయన్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని బృందావన్ రసాయన పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చౌటుప్పల్ ప్రాంతంలో 20 వేలకు పైగా వలస కార్మికులు ఉన్నారని ప్రభుత్వం సర్వే చేసి కార్మికులకు భరోసా ఇవ్వాలని ,పరిశ్రమలలో పనిచేసే కార్మికుల సమాచారం బహిర్గత పర్చాలని డిమాండ్ చేశారు. ఈ పరిశీలనలో డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనగంటి వెంకటేష్,సీఐటీయూ జిల్లా కోశాధికారి ఎండీ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బూరుగు కృష్ణా రెడ్డి లు పాల్గొన్నారు.
-పరిశ్రమంలో ధ్వంసమైన రెండు బ్లాకులు..
చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామపంచాయతీ పరిధిలోని బృందావన్ రసాయన పరిశ్రమలో శుక్రవారం రాత్రి రియాక్టర్లు పేలి భారీ శబ్దాలతో మంటలు చెలరేగాయి. భారీ శబ్దంతో రియాక్టర్ లు పేలిపోవడంతో స్థానికులు ఏమి జరుగుతుందో తెలియక భయాందోళనకు గురయ్యారు. పేలుడు దాటికి పరిశ్రమలోని రెండు బ్లాకులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. పరిశ్రమలో పనిచేసే నలుగురు కార్మికులు గాయపడినట్లు తెలిసింది. భారీ శబ్దంతో రియాక్టర్లు పేలిపోవడంతో సమీప ప్రాంతాలైన ఎల్లగిరి, ఎల్లంబావి, కొయ్యలగూడెం,ధర్మోజి గూడెం, భూదాన్ పోచంపల్లి, దోతి గూడెం, అంతమ్మ గూడెం, జిబ్లక్ పల్లి, భీమనపల్లి గ్రామాల ప్రజలు భయాందోళనకు గురైనట్లు గ్రామాల ప్రజలు తెలిపారు. రియాక్టర్లు పేలిన వెంటనే క్షణాల్లో మంటలు చెలరేగి పరిశ్రమ మొత్తానికి వ్యాపించడంతో రెండు బ్లాకులు పూర్తిగా ధ్వంసమై భారీ ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది. ఇంత పెద్ద ప్రమాదం జరిగిన కేవలం నలుగురు మాత్రమే స్వల్ప గాయాలతో బయటపడటం ఏమిటనే సందేహాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. దీని వెనక ఏమైనా కుట్ర దాగి ఉన్నదా అనే కోణంలో దర్యాప్తు చేయాలని, ఇలాంటి ప్రమాదాలు మరలా పునరావృతం కాకుండా ప్రజలను కాపాడాలని, తరచూ కంపెనీలపై తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
