Bird Flu Precaution in Tamil Nadu: తమిళనాడులో బర్డ్ ఫ్లూ వ్యాప్తి అధికంగా ఉండటంతో ప్రజలకు అక్కడి ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. హాప్ బాయిల్డ్ గుడ్డు తింటే అనారోగ్యానికి గురవుతారని, తదుపరి ఉత్తర్వులిచ్చేంత వరకు హాఫ్ బాయిల్డ్ తినొద్దని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం సూచించారు.
ఇటీవల అడయార్ పరిసర ప్రాంతాల్లో గుంపులు గుంపులుగా కాకులు మృతి చెందటానికి బర్డ్ ఫ్లూ వ్యాప్తి కారణమని కేంద్రప్రభుత్వం ప్రకటించిందని, దీంతో రాష్ట్రంలో ఆ వ్యాధి ప్రబలకుండా ఉండేందుకు ఆరోగ్యశాఖ చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఫారమ్ కోడి మాంసాన్ని బాగా ఉడికించే తినాలని, అదే విధంగా కోడిగుడ్డు కూడా బాగా ఉడికించి తీసుకోవాలని, ఎట్టి పరిస్థితులలోనూ హాఫ్బాయిల్డ్ జోలికి వెళ్లకూడదని హెచ్చరించారు.
ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులలో క్యాథ్ల్యాబ్లను ఏర్పాటు
దేశవ్యాప్తంగా రోజురోజుకూ హృద్రోగుల సంఖ్య అధికమవుతుండటంతో రాష్ట్రంలో హృద్రోగంతో బాధపడుతున్నవారికి మెరుగైన చికిత్సలందించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులలో క్యాథ్ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఓమండూరార్ ఆస్పత్రిలో క్యాథ్ల్యాబ్ ఏర్పాటు చేశామని, దీనితో రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్యాథ్లాబ్ల సంఖ్య ఏడుకు పెరిగిందన్నారు.
అటు త్వరలోనే కడలూరు, నీలగిరి, తిరువళ్లూరు, తిరువణ్ణామలై, రామనాధపురంలోనూ ఈ ల్యాబ్లు ఏర్పాటు చేయనున్నామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్యవిద్యా పరిశోధన సంస్థ డైరెక్టర్ డాక్టర్ సుగంధి రాజకుమారి, ప్రభుత్వ బహుళ ప్రయోజనాల ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ మణి, హృద్రోగ చికిత్సా నిపుణులు డాక్టర్ సెసిలీ మేరీ మెజిల్లా తదితరులు పాల్గొన్నారు.









