
-
మా డబ్బులు ఇప్పించాలని బ్యాంకు ఎదుట మహిళల ఆందోళన.
క్రైమ్ మిర్రర్, నల్గొండ బ్యూరో : నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని బంధన్ బ్యాంకు మేనేజర్ మహిళలను బడా మోసానికి గురి చేశాడు. పొదుపు సంఘాల మహిళలు కట్టిన సుమారు 6 లక్షల రూపాయల డబ్బుతో బ్యాంకు మేనేజర్ ఉడాయించాడు. మా డబ్బు ఇప్పించాలని కోరుతూ పలువురు మహిళలు బ్యాంకు ఎదుట ఆందోళనకు దిగారు.
మోసం వెలుగు చూసింది ఇలా :- కోల్ కతా లో హెడ్ ఆఫీస్ ఉన్న బంధన్ బ్యాంకు దేవరకొండ శాఖలో మొత్తం 104 గ్రూపులు, 1309 మంది సభ్యులు పొదుపు చేసుకున్నారు. వారి వారి వ్యక్తిగత అవసరాల కోసం రుణాలు తీసుకుని వారం వారం డబ్బులు చెల్లించేవారు. ఈ క్రమంలో గతంలో నవంబర్ 23 న బంధన్ బ్యాంకు శాఖలో కొండ మల్లేపల్లి కి చెందిన సాయితేజ మహిళా సంఘం పేరుతో ఒక్కొక్కరు 50,000 రూపాయల చొప్పున లోను తీసుకున్నారు. అందులో 5,000 రూపాయలు ఖర్చులకు పోను 18 మంది సభ్యులకు ఒక్కొక్కరికి 45,000 రూపాయలను బ్యాంకు సిబ్బంది చెల్లించారు. లోను తీసుకున్న డబ్బులకు గాను ఒక్కో సభ్యురాలు వారానికి 1400 రూపాయల చొప్పున 48 వారాలు బ్యాంకుకు చెల్లించాల్సి ఉంది. బ్యాంకు నిబంధనల ప్రకారం బాధితులు బ్యాంకు రికవరీ ఏజెంట్ అంజి కి పూర్తి డబ్బులు చెల్లించారు.
Read More : సై అంటే సై అంటున్న రసమయి, కవ్వంపల్లి – లడాయి ఎందుకో తెలుసా..?
తిరిగి తమకు కొత్త లోను ఇవ్వాలని గత ఆరు నెలలుగా మహిళలు బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు. కాగా మహిళలు తమకు కొత్త లోను ఎందుకు ఇవ్వడం లేదని బ్యాంకులో ఆరా తీయగా వారి పేర్లపై అప్పు ఉన్నట్లు ప్రస్తుత బ్యాంకు అధికారులు చెబుతున్నారు. దీంతో మహిళలు తమ దగ్గర డబ్బులు వసూలు చేసిన బ్యాంకు రికవరీ ఏజెంట్ అంజి ని నిలదీయగా తాను వసూలు చేసిన డబ్బులను బ్యాంకు మేనేజర్ హేమంత్ షీ కి అప్పగించానని, అతను డబ్బులు వాడుకున్నాడని బ్యాంకు రికవరీ ఏజెంట్ అంజి చెప్పాడు.
సస్పెన్షన్ చేసి చేతులు దులుపుకున్న అధికారులు.:- బంధన్ బ్యాంకు దేవరకొండ శాఖలో అవకతవకలు జరిగాయని గుర్తించిన బ్యాంకు ఉన్నతాధికారులు 20 రోజుల క్రితం బ్యాంకుకు వచ్చి బ్యాంకులో అవకతవకలు జరిగాయని నిర్ధారించి, బ్యాంకు మేనేజర్ హేమంత్ షీ, క్యాషియర్ శ్రవణ్, సిబ్బంది రమావత్ పవార్, వంగూరి ఆంజనేయులు, రమావత్ చింటూ లను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు.
Read More : సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టే వారిపై ప్రత్యేక నిఘా
ఇదిలా వుండగా తమకు కొత్త లోను ఇవ్వకపోవడంతో పాటు తమ పేర్ల మీద 1,80,000 రూపాయల అప్పు ఉందని బ్యాంకు అధికారులు చెబుతున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు. బ్యాంకులో అవకతవకలు జరిగాయని సిబ్బంది తమకు చెప్పకుండా వారిని సస్పెండ్ చేయడంతో బ్యాంకు మేనేజర్ హేమంత్ షీ కోల్ కతా కు పారిపోయాడని మహిళలు చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న బ్యాంకు మేనేజర్ కు తమ సమస్య గురించి చెప్పగా తాను కొత్తగా వచ్చానని, తనకేమీ తెలియదని చెబుతున్నారని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని మహిళలు బ్యాంకు ఎదుట బైఠాయించారు.