
-
అల్లూరి జిల్లా పురుషోత్తపట్నంలో ఘటన
-
పురుషోత్తపట్నంలో భద్రాద్రి ఆలయానికి 889.50 ఎకరాల భూమి
-
ఆలయానికి భూములు అప్పగించాలని ఏపీ హైకోర్టు ఉత్తర్వులు
-
హైకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ నిర్మాణాలు
-
అడ్డుకునేందుకు వెళ్లిన భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి
-
రమాదేవిపై దాడి చేసిన భూ ఆక్రమణదారులు
-
స్పృహతప్పి పడిపోయిన ఈవో రమాదేవి, ఆస్పత్రికి తరలింపు
క్రైమ్ మిర్రర్, ప్రత్యేక ప్రతినిధి: కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిపై భూఆక్రమణదారులు దాడి చేశారు. ఈ ఘటనలో రమాదేవి స్పృహతప్పి పడిపోయారు. దీంతో హుటాహుటిన భద్రాచలంలోని ప్రైవేటు ఆస్పత్రికి ఆమెను తరలించారు.
వివరాల్లోకి వెళ్తే… అల్లూరి జిల్లా పురుషోత్తపట్నంలో భద్రాచలం ఆలయానికి చెందిన 889.50 ఎకరాల భూమి ఉంది. ఈ భూముల్లో స్థానికులు సాగు చేసుకుంటున్నారు. కొందరు అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. ఈ భూములన్నీ భద్రాచలం ఆలయానికి చెందినవని ఏపీ హైకోర్టు తేల్చింది. వెంటనే భూములను ఆలయానికి అప్పగించాలని ఉత్తర్వులిచ్చింది. కానీ కొందరు ఆక్రమణదారులు ధర్మాసనం ఉత్తర్వులను పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టారు.
విషయం తెలుసుకున్న ఈవో రమాదేవి పనులను అడ్డుకునేందుకు వెళ్లారు. కోపోద్రిక్తులైన భూ ఆక్రమణదారుల ఈవోపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఈవో రమాదేవి స్పృహతప్పిపడిపోయారు. కాగా దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ భూముల విషయంలో స్థానికులకు, ఆలయ ఉద్యోగులకు చాలా కాలంగా వివాదం నడుస్తోంది.