
Azamgarh Police Attack: డీజే ఆపాలన్న పాపానికి పోలీసులను చావగొట్టారు. కర్రలతో ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టారు. దెబ్బలకు తట్టుకోలేక పోలీసులు పారిపోయారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో సంచలనం సృష్టించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
యూపీలోని అజామ్ ఘర్ పరిధిలోని బర్రాలో రాత్రి పూట ఓ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీజే ఏర్పాటు చేశారు. ఆ డీజే లొల్లి పెద్ద వివాదానికి కారణం అయ్యింది. ముందు ఇరువర్గాల మధ్య పంచాయితీ కాగా, ఆ తర్వాత పోలీసులను కొట్టే వరకు వెళ్లింది. పాటల విషయంలో రెండు వర్గా మధ్య వివాదం చెలరేగింది. ఆ వివాదం కాస్త పెద్దదిగా మారింది. రెండు వర్గాలు ఒకరిపై మరొకరు దాడులకు దిగారు. ఈ విషయం పోలీసులకు తెలిసింది.
పోలీసులపై తిరగబడ్డ జనం
గొడవను ఆపేందుకు బర్ధాహ్ పోలీస్ స్టేషన్ ఇన్ ఛార్జ్ రాజీవ్ కుమార్ సింగ్ తన సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లాడు. పోలీసులు ఆ గొడవను ఆపే ప్రయత్నం చేశారు. అక్కడే సీన్ రివర్స్ అయ్యింది. రెండు వర్గాలు పోలీసుల మీదే తిరగబడ్డారు. కర్రలు, రాళ్లతో పోలీసుల మీదికే కొట్లాటకు దిగారు. ఖాకీలను విచక్షణా రహితంగా కొట్టారు. కొంత మందిని కింద పడేసి కొట్టారు. మరికొంత మంది పారిపోతున్న పోలీసులపైనా వెంటబడి దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు తీవ్రంగా గాయాపడ్డారు. వారందరినీ హాస్పిటల్ కు తరలించారు.
54 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏకంగా 54 మంది మీద కేసులు నమోదు చేశారు. వారిలో 17 మందిని అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పోలీసులపై దాడి చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దెబ్బలు తట్టుకోలేక పోలీసులు కేకలు పెట్టడం ఆ వీడియోల్లో కనిపిస్తోంది.
Read Also: చీరలో తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. సీన్ కట్ చేస్తే..