
Shubhanshu Shukla: అంతరిక్షకేంద్రానికి వెళ్లిన ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాన్షు శుక్లా కీలక ప్రయోగాల్లో బిజీగా ఉన్నారు. అంతరిక్షంలో రైతుగా మారారు. మెంతి, పెసర విత్తనాలు వేసి పెంచుతున్నారు. గాజు పాత్రల్లో వాటిని సాగు చేస్తున్నారు. జీరో గ్రావిటీలో ఈ మొక్కలు ఎలా పెరుగుతాయి? అనే అంశాలపై ఆయన పరిశోధన చేస్తున్నారు. ఐఎస్ఎస్లోని ప్రత్యేక స్టోరేజీ ఫ్రీజర్ లో వాటిని ఉంచి మొలకెత్తే విధానాన్ని తాజాగా ఫొటోలు తీశారు. ఈ పరిశోధనలో ధార్వాడ్ ఆగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన రవికుమార్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన సుధీర్ అనే శాస్త్రవేత్తలు ఆయనకు సహకరిస్తున్నారు. శుక్లా భూమికి తిరిగి వచ్చాక ఈ మొలకల్లోని జన్యు మార్పులు, పోషక విలువలను పరిశీలించనున్నట్లు యాక్సియం స్పేస్ సంస్థ వెల్లడించింది. వ్యవసాయ ప్రయోగాలతో పాటు శుభాన్షు ఇతర కీలక ప్రయోగాల్లోనూ పాల్గొంటున్నారు.
14న శుభాన్షు శుక్లా తిరుగు ప్రయాణం
యాక్సియం-4 మిషన్ ద్వారా అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన శుభాన్షు శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాముల తిరుగు ప్రయాణం ఖరారైంది. జూలై 14న భూమి మీదకు వ్యోమగాముల తిరుగు ప్రయాణం ఉంటుందని నాసా ప్రకటించింది. యాక్సియం-4 పురోగతిని జాగ్రత్తగా గమనిస్తున్నట్లు చెప్పిన నానా, ఆ మిషన్ను అన్ డాక్ చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకు జూలై 14ను టార్గెట్ గా నిర్ణయించినట్లు తెలిపింది. ఈ మేరకు నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రాం మేనేజర్ స్టీవ్ స్టిచ్ మీడియాకు తెలిపారు. శుభాన్షు భూమ్మీదకు వచ్చిన తర్వాత ఆయన పరిశోధలనపై పూర్తి స్థాయి అధ్యయనం కొనసాగనుంది.
Read Also: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. అధికారుల హెచ్చరికలు!