ఆంధ్ర ప్రదేశ్

అమరావతి కోసం మరో 40వేల ఎకరాలు - పూలింగ్గా..? అక్విజేషనా..?

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచింది ప్రభుత్వం. హైరేంజ్‌లో-హైటెక్‌ నిర్మాణాలకు ప్రణాళికలు వేస్తోంది. అత్యాధునిక భవనాల నిర్మాణాలకు టెండర్లు కూడా పూర్తి చేసింది. మరోవైపు… ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం భూసేకరణకు సిద్ధమవుతోంది. ల్యాండ్‌ పూలింగ్‌లో 40వేల ఎకరాలు అవసరం అవుతాయని అంటోంది ప్రభుత్వం. త్వరలోనే సేకరణ ప్రారంభిస్తామని తెలిపింది.

అమరావతి కోసం ఇప్పటికే 33వేల ఎకరాలు సేకరించింది ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు మరో 40వేల సేకరణకు సిద్ధమైంది. సేకరించబోయే భూముల్లో అత్యాధినిక ఎయిర్‌పోర్టుల నిర్మించాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఇంటర్నేషన్‌ ఎయిర్‌పోర్టు తరహాలో… అమరావతిలో కూడా అంతర్జాతీయ ఎయిపోర్టును నిర్మించాలని డిసైడ్‌ అయ్యింది. అందుకోసం 5వేల ఎకరాలు కావాలని తెలిపింది. అలాగే… 2,500 ఎకరాల్లో స్మార్టు ఇండస్ట్రీ, మరో 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ క్రీడా సిటీని నిర్మించబోతోంది. వీటి కోసం దాదాపు 10 వేల ఎకరాలు అవసరం అవుతాయట. ఆ భూమిని రైతుల నుంచి సేకరించాలని నిర్ణయించింది. అయితే ల్యాండ్ పూలింగ్ చేయాలా…? లేదా అక్విజేషన్‌ ద్వారా తీసుకోవాలా అని ఆలోచిస్తోంది. పూలింగ్‌ ద్వారా అయితే.. 40వేల ఎకరాలు సేకరించాల్సి ఉంటుందని మంత్రి నారాయణ తెలిపారు. అప్పుడే 10వేల ఎకరాలు మిగుతాయన్నారు. ల్యాండ్‌ అక్విజేషన్‌ అయితే 10వేల ఎకరాలు సరిపోతాయన్నారు. అయితే… రైతులు ల్యాండ్‌ పూలింగ్‌ వైపే మొగ్గుచూపుతున్నారని తెలిపారు. కనుక… వీలైనంత వరకు ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారానే సేకరిస్తామన్నారు.

ల్యాండ్‌ పూలింగ్‌..? లేదా అక్విజేషన్‌..? ఏ విధంగా భూమి సేకరించాలనేది రైతుల అభిప్రాయం మేరకే ఆధారపడి ఉంటుందని తెలిపింది ప్రభుత్వం. రైతుల అభిప్రాయాలు తీసుకునేందుకు గ్రామసభలు పెడతామని తెలిపారు. ఆ బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యేలకు అప్పజెప్పామన్నారు మంత్రి నారాయణ. మరోవైపు.. ఇప్పటికే 36వేల ఎకరాలను ల్యాండ్‌ పూలింగ్‌లో ఇచ్చేందుకు రైతులు ముందుకొచ్చినట్టు చెప్పారాయన.

ఇది అటుంచితే.. అమరావతిలో ఐదు అడ్మినిస్ట్రేటివ్‌ టవర్ల నిర్మాణం మొదలవుతోంది. దీనికి సంబంధించి టెండర్లు కూడా పూర్తయ్యాయి. 3,673 కోట్ల రూపాయలతో ఐదు అడ్మినిస్ట్రేటివ్‌ టవర్ల నిర్మాణం జరగబోతోంది. 882కోట్లతో నిర్మించే GAD టవర్ నిర్మాణానికి సంబంధించిన టెండర్‌ను NCC సంస్థ దక్కించుకుంది. అలాగే… 1,487 కోట్లతో నిర్మించే హెచ్‌వోడీ 1, 2 టవర్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్‌ను షాపూర్జీ అండట్ పల్లంజీ సంస్థ దక్కించుకుంది. 1,304 కోట్లతో నిర్మించే హెచ్‌వోడీ మూడు, నాలుగు టవర్ల టెండర్‌ను ఎల్‌ అండ్‌ టీ సంస్థ దక్కించుకుంది. త్వరలోనే నిర్మాణ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button