#Chandur మున్సిపాలిటీలో రాజకీయ వేడి పెంచిన అన్నెపర్తి శేఖర్ మేనిఫెస్టో
రెండో వార్డులో మార్పు సంకేతాలు.. ప్రజల్లో విశ్వాసం, రాజకీయ వర్గాల్లో కలవరం

Anneparthy Shekar : చండూరు మున్సిపాలిటీలో పోలింగ్ సమీపిస్తున్న వేళ ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతుంది, రెండో వార్డు నుంచి బరిలో దిగిన బీఆర్ఎస్ అభ్యర్థి అన్నెపర్తి శేఖర్ ప్రకటించిన మేనిఫెస్టో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. విద్య, వైద్యం, ఆరోగ్యం, పారిశుధ్యం వంటి ప్రజల నిత్యజీవితానికి సంబంధించిన అంశాలను కేంద్రంగా చేసుకుని రూపొందించిన ఈ మేనిఫెస్టో ప్రజల మనసులను గెలుచుకుంటోంది అన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
ప్రత్యేకంగా ప్రజా సమస్యలపై స్పష్టమైన హామీలు, అమలుకు వీలైన ప్రతిపాదనలు ఉండటంతో, అన్నెపర్తి శేఖర్ మేనిఫెస్టోను సాధ్యాసాధ్యాల మేనిఫెస్టో గా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా రెండో వార్డులో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలను నేరుగా టచ్ చేయడం ఆయనకు అనుకూలంగా మారిందని అంటున్నారు.
మేనిఫెస్టోలో ప్రధానంగా సర్దార్ కాలనీ, బస్టాండ్ ప్రాంతాల్లో వేసవికాలంలో తీవ్రంగా ఎదురవుతున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా స్వంత ఖర్చులతో రెండు బోర్లు, ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం హామీ ఇవ్వడం మహిళల్లో విశేష స్పందనను తెచ్చింది. అలాగే అంగన్వాడి కేంద్రాన్ని ప్రీ ప్రైమరీ స్కూల్గా మార్చి నూతన భవన నిర్మాణం చేపడతానన్న ప్రకటన విద్యావంతుల దృష్టిని ఆకర్షించింది.
ప్రతి కుటుంబానికి భద్రత కల్పించే దిశగా PMJJBY పథకం ద్వారా రూ.2 లక్షల మరణ భీమా, అలాగే ప్రతి ఇంటికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా ఉండేలా అవగాహన కల్పిస్తానన్న హామీలు ప్రజల్లో భరోసా కలిగిస్తున్నాయి. మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలు, ఇండస్ట్రియల్ లోన్లకు ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటు ప్రతిపాదనలు మహిళా ఓటర్లను ఆకట్టుకుంటున్నాయని స్థానికంగా చర్చ జరుగుతోంది.
ఇక దేవాలయాల అభివృద్ధి అంశాన్ని కూడా మేనిఫెస్టోలో పొందుపరచడం విశేషం. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం, శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయాల నిర్మాణాలను పూర్తి చేసి ఎండోమెంట్ పరిధిలోకి తీసుకొస్తానన్న హామీతో భక్తుల మద్దతు కూడగట్టే ప్రయత్నం కనిపిస్తోంది. పశుసంతలో మౌలిక వసతులు, నూతన పశువైద్యశాల, అసంపూర్ణంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పూర్తి చేయడం, నూతన బస్టాండ్ నిర్మాణం కోసం పోరాటం చేయనున్నట్టు ప్రకటించడం వ్యాపార వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, మిషన్ భగీరథ కనెక్షన్ లేని ఇండ్లకు త్వరిగతన నూతన కనెక్షన్లు, వార్డు క్లినిక్స్ ద్వారా ఉచిత పరీక్షలు, ఉచిత మందుల పంపిణీ వంటి అంశాలు మేనిఫెస్టోకు బలమైన ప్రజా ముద్ర వేసాయి.
అన్నెపర్తి శేఖర్ తన మేనిఫెస్టోలో “విద్య ఒక వ్యాపారం కాదు – విద్య ఒక సేవ” అనే నినాదాన్ని ముందుకు తెస్తూ, కారు గుర్తుకు ఓటేస్తే ప్రభుత్వ పాఠశాలలను PM SHRI పథకం ద్వారా ఇంటర్నేషనల్ స్కూల్ తరహాలో అభివృద్ధి చేయడం తథ్యం అని ప్రకటించడం రాజకీయంగా సంచలనంగా మారింది. ప్రైవేట్ విద్యా సంస్థల అధిక ఫీజులపై చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఈ పరిణామాలన్నింటితో, రెండో వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి విజయ బావుటా ఎగురవేయడం దాదాపు ఖాయమన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. భారత రాష్ట్ర సమితి తరఫున పోటీ చేస్తున్న అన్నెపర్తి శేఖర్ మేనిఫెస్టో కేవలం హామీల పత్రం కాకుండా, రెండో వార్డులో అభివృద్ధి దిశను చూపించే రోడ్మ్యాప్గా ప్రజలు భావిస్తున్నారని స్థానికులు అంటున్నారు. మొత్తంగా, చండూరు మున్సిపాలిటీలో రెండో వార్డు రాజకీయ సమీకరణాలను మార్చే శక్తి ఉన్న మేనిఫెస్టోగా అన్నెపర్తి శేఖర్ ప్రకటన నిలిచిందని, ఇది ఎన్నికల ఫలితాలపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.









