Air India Hikes Fuel Surcharge: దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు ఇకపై మరింత కాస్ట్లీగా మారనున్నాయి. ఎయిర్ ఇండియా గ్రూప్ తాజాగా విమాన టికెట్లపై ఇంధన సర్చార్జీని పెంచాలని నిర్ణయం తీసుకుంది. ప్రయాణ దూరాన్ని బట్టి ఈ అదనపు ఛార్జీలు విధించనున్నట్లు తెలిపింది.
కొత్త నిర్ణయం ప్రకారం, దేశీయ విమానాలపై రూ.299 నుంచి రూ.899 వరకు సర్చార్జీ వసూలు చేయనున్నారు. అంతర్జాతీయ విమానాల విషయంలో ఇది 24 డాలర్ల నుంచి 280 డాలర్ల వరకు ఉండనుంది. కొన్ని రూట్లకు మినహాయింపులు ఉంటాయి. ఈ మార్పులు దేశీయ ప్రయాణికులకు ఏప్రిల్ 8 నుంచి, అంతర్జాతీయ ప్రయాణికులకు ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో ఎయిర్ ఇండియా మరియు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ టికెట్ ధరలు పెరగనున్నాయి.
ఇంధన ధరలు పెరగడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా ఎయిర్ ఇండియా ప్రకటించింది. ముఖ్యంగా పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. దాంతో విమాన ఇంధనం ధరలు కూడా పెరిగాయి. అయితే దేశీయ విమానాల కోసం ఈ పెంపును ప్రభుత్వం 25 శాతం వరకు మాత్రమే పరిమితం చేసింది.
ఇక ఇప్పటికే మరో ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కూడా ఇంధన సర్చార్జీని పెంచింది. అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నివేదిక ప్రకారం, ఫిబ్రవరి చివరికి విమాన ఇంధన ధర బ్యారెల్కు 99.40 డాలర్లు ఉండగా, మార్చి చివరికి అది 195.19 డాలర్లకు చేరుకుంది. అంటే తక్కువ సమయంలోనే దాదాపు రెట్టింపు అయింది. విమానయాన సంస్థల ఖర్చుల్లో ఇంధన వ్యయం దాదాపు 40 నుంచి 45 శాతం వరకు ఉంటుంది. కాబట్టి ఇంధన ధరలు పెరిగితే టికెట్ ధరలు కూడా పెరుగుతాయి. మొత్తంగా, ఈ పరిణామాల కారణంగా రాబోయే రోజుల్లో విమాన ప్రయాణ ఖర్చులు పెరగడం ఖాయం అని చెప్పవచ్చు.
