-
గుర్రంపోడు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ పంజా..
-
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్ఐ!
గుర్రంపోడు(క్రైమ్ మిర్రర్):- నల్గొండ జిల్లా, గుర్రంపోడు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో, సోమవారం సంచలనం చోటుచేసుకుంది. అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 20వేలు లంచం తీసుకుంటూ చిక్కిన మహమ్మద్ హకీమ్ ను అదుపులోకి తీసుకున్నారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఒక భూమికి సంబంధించిన పని నిమిత్తం, గుర్రంపోడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ మహమ్మద్ హకీమ్, బాధితుడి నుండి 20వేల రూపాయలను లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, పథకం ప్రకారం దాడి చేసిన అధికారులు, నగదు తీసుకుంటుండగా హకీమ్ను అదుపులోకి తీసుకున్నారు.

దాడి అనంతరం ఏసీబీ బృందం, తహసీల్దార్ కార్యాలయంలోని కీలక రికార్డులను పరిశీలించింది.
కార్యాలయ ద్వారాలను మూసివేసి, ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. కేవలం ఆర్ఐ మాత్రమేనా, లేక ఇతర ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉందా, అనే కోణంలో విచారణ జరుగుతోంది.
గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ఫైళ్లను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసారు. భారీగా చేరుకున్న ప్రజలు
ఏసీబీ సోదాల వార్త తెలియడంతో, కార్యాలయం వెలుపల మీడియా ప్రతినిధులు, స్థానిక ప్రజలు భారీగా గుమిగూడారు. రెవెన్యూ కార్యాలయంలో అవినీతిపై ప్రజలు చర్చించుకుంటున్నారు.
సోదాలు ముగిసిన తర్వాత అధికారులు, పూర్తి వివరాలతో కూడిన ప్రెస్ నోట్ విడుదల చేయనున్నారని సమాచారం. ఏసీబీ అధికారులు ప్రస్తుతం హకీమ్ చేతుల నుండి, రంగు పూసిన నోట్లను స్వాధీనం చేసుకుని, రసాయన పరీక్షలు నిర్వహించారు. పూర్తి నివేదిక అందాల్సి ఉంది.





