తెలంగాణ

7 రోజుల్లో 17,869 వేల కోట్లు ఇచ్చాం… రేవంత్ సంచలనం

రైతు రుణమాఫీపై ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి. రుణ‌మాఫీపై మా వాగ్దానాన్ని నెర‌వేర్చామని.. 7 రోజుల్లో 22.22 ల‌క్ష‌ల రైతుల‌కు చెందిన రూ.17,869 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని లేఖలో చెప్పారు. రుణ‌మాఫీ వాగ్దానంతో తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ దానిని నెర‌వేర్చ‌లేద‌ని.. రైతులు రుణ‌మాఫీకి ఎదురుచూస్తున్నారంటూ మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల స‌భ‌లో విమ‌ర్శించారు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ.ఈ ఆరోపణలకు తన లేఖలో కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రుణ‌మాఫీని త‌మ ప్ర‌భుత్వం ఏ విధంగా చేసిందో లేఖ ద్వారా ప్ర‌ధాన‌మంత్రికి తెలిపారు.

తెలంగాణ‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం రైతుల రుణ‌మాఫీ వాగ్దానాన్ని నెర‌వేర్చిందని.. క్షేత్ర స్థాయి ప‌రిస్థితుల‌ను భిన్నంగా వ‌చ్చిన మీ ప్ర‌క‌ట‌న వేద‌న‌కు, ఆశ్చ‌ర్చాన్నికి గురి చేసిందని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణ‌లో రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు రైతుల‌కు ఉన్న రుణాల‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం మాఫీ చేసిందని స్పష్టం చేశారు. తొలుత 2024, జులై 18న రూ.ల‌క్ష వ‌ర‌కు రుణాలున్న 11,34,412 మంది రైతుల ఖాతాల‌కు రూ.6,034.97 కోట్ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది.త‌ర్వాత జులై 30వ తేదీన 6,40,823 మంది రైతుల రుణ ఖాతాల‌కు రూ.6,190.01 కోట్ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది. ఆగ‌స్టు 15వ తేదీన 4,46,832 మంది రైతుల రుణ ఖాతాల‌కు రూ.5,644.24 కోట్ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది. మొత్తం 22,22,067 మంది రైతుల‌కు చెందిన రుణ ఖాతాల‌కు రూ.17,869.22 కోట్లు బ‌దిలీ చేసిందని అన్నారు.

27 రోజుల వ్య‌వ‌ధిలోనే 22,22,067 మంది రైతుల‌ను రుణ‌విముక్తుల‌ను చేశామని ప్రధానికి రాసిన లేఖలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రైతుల‌పై రుణ భారం లేకుండా చూడ‌డంతో పాటు రాష్ట్ర వ్య‌వ‌సాయ ఉత్పాద‌క‌త‌లో పెంచ‌డంలో వారిని బ‌లోపేతం చేసేందుకు మా ప్ర‌భుత్వం కృత‌నిశ్చ‌యంతో ఉంద‌నేందుకు రుణ‌మాఫీనే నిద‌ర్శ‌నమన్నారు. రుణ‌మాఫీ రైతుల‌ను బ‌లోపేతం చేయ‌డ‌మే కాదు వారిలో నైతిక స్థైరాన్ని నింపుతుంద‌ని మేం గ‌ట్టిగా విశ్వ‌సిస్తున్నామని తెలిపారు.రూ.2 లక్ష‌ల‌కుపైగా రుణాలు ఉన్న వారికి రుణ‌మాఫీ వ‌ర్తింప‌జేస్తామన్నారు. రూ.2 ల‌క్ష‌ల‌కుపైగా ఉన్న మొత్తాన్ని రైతులు చెల్లిస్తే రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉన్న రుణాల‌ను మేం మాఫీ చేస్తామని తెలిపారు. రుణ‌మాఫీ కోస‌మే మా ప్ర‌భుత్వం ఈ ఏడాది బ‌డ్జెట్‌లో రూ.26 వేల కోట్లు కేటాయించిందన్నారు. అర్హులైన ప్ర‌తి రైతుకు రుణ‌మాఫీ జ‌రగాల‌నే ఉద్దేశంతో రూ.31 వేల కోట్ల వ‌ర‌కు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
తెలంగాణ రైతుల‌కు మ‌ద్ద‌తు నిల‌వాల‌ని మీకు మీకు విజ్ఞ‌ప్తి చేస్తున్నామన్ని లేఖలో వివరించారు సీఎం రేవంత్ రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button